డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఇలాకాలో: హాస్టల్లో విద్యార్థులకు పాముకాటు: ఒకరి మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులకు పాము కాటు వేసింది. అర్ధరాత్రి తమ గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్ధులను కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి మరణించాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా విజయనగరం మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆసుపత్రికి వెళ్లారు. విద్యార్థులు, వారి కుటుంబాలను పరామర్శించారు.
జ్యోతిబాపూలే బీసీ హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతం అడవిలా ఉంటుంది. తరచూ పాములు ప్రవేశిస్తుంటాయి. గురువారం అర్ధరాత్రి విద్యార్థులు తమ గదుల్లో నిద్రిస్తోన్న సమయంలో కట్ల పాము ప్రవేశించింది. దాల్వాయిపేటకు చెందిన మంతిని రంజిత్, జిగరం గ్రామానికి చెందిన వంశీ, జగ్గునాయుడిపేట విద్యార్థి వంగపండు నవీన్ను కాటు వేసింది. పామును చూసిన విద్యార్థులు అందరూ గట్టిగా కేకలు వేశారు. హాస్టల్ సిబ్బంది పామును చంపేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
తొలుత కురుపాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రంజిత్ మరణించారు. ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మిగిలిన ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం విజయనగరం మహారాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో ఒక విద్యార్థి వెంటిలేటర్పై ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. చనిపోయిన రంజిత్ పేరెంట్స్ శోక సముద్రంలో మునిగిపోయారు.
Recommended Video
ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పుష్ప శ్రీవాణి ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. రంజిత్ మరణించడం బాధించిందని చెప్పారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తానని, ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోనివ్వమని అన్నారు.