టీఆర్ఎస్కు షాక్: రాజీనామా చేసిన ప్రదీప్ రావు, ఆ ఎమ్మెల్యేపై ఫైర్, బీజేపీ వైపేనా?
వరంగల్: టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ను వీడారు. వరంగల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డారు.
అప్పట్నుంచి పార్టీపై అసంతృగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాజీనామా చేసినట్లు ఆదివారం తెలిపారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు పడ్డాను. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మా కార్యకర్తలకు టీఆర్ఎస్ ఏమీ చేయలేదు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశా అని ప్రదీప్ రావు తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే(నరేందర్) అవమానపరిచేలా మాట్లాడారని చెప్పారు. పార్టీలో ఉండానే తమను తిట్టారన్నారు. చేరేస్తా అంటూ బెదింపులకు గురిచేశారన్నారు. సదరు ఎమ్మెల్యే తిట్టినా టీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా ఖండించలేదన్నారు. కనీస గుర్తింపు లేనప్పుడు ఈ పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు.
ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తానని, లేదంటే స్వతంత్రంగా ఉంటానని ప్రదీప్ రావు తెలిపారు. కాగా, ప్రదీప్ రావు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే బీజేపీలోకి కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications