అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడు అరెస్ట్ ... అరకిలో బంగారం స్వాధీనం
వ్యాపార సముదాయాలను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాలో మరో సభ్యుడిని వరంగల్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఒక సభ్యుడ్ని పట్టుకుని కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని పట్టుకుని అతని వద్దనుండి 20 లక్షల విలువ చేసే అరకిలో బంగారాన్ని, 2 లక్షల 70 వేల రూపాయల నగదును, అలాగే ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు.
జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యాపార సముదాయాల్లో షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న హుస్సేన్ అలియాస్ హుస్సేన్ కటాత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలకు పాల్పడటంకోసం హుస్సేన్ ఒక గ్యాంగ్ ని తయారు చేసాడు. బెంగళూరుకు చెందిన శివా రెడ్డి అలియాస్ ఎంబీ రెడ్డి, రాజస్థాన్ కు చెందిన మాన్ సింగ్, ఇక తనకు దూరపు బంధువైన సోను కటాత్ తో కలిసి ఓ ముఠాగా ఏర్పడి దోపిడీలు చేయడానికి ఇతర రాష్ట్రాలను ఎంచుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం లలో దోపిడీలు చేశారు.
ఈ సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు 14 దోపిడీకి పాల్పడ్డారు. వ్యాపార సముదాయాలను షట్టర్ తాళాలు పగులగొట్టి ఈ ముఠా దోపిడీకి పాల్పడింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల వరంగల్ బట్టల బజార్ లోని ఒక బట్టల దుకాణానికి సంబంధించిన అకౌంట్ కార్యాలయంలో 16 లక్షల 50 వేలు కలిగిన బంగారు బిస్కెట్లను, అభరణాలను చోరీ చేశారు.
వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగానూ, సంకేతిక పరిజ్ఞానంతో సైతం వినియోగించుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో శివారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇక తాజాగా మరో చోరీకి రెక్కీ నిర్వహిస్తున్న, అదేవిధంగా చోరీ చేసిన బంగారాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో హుస్సేన్ కటాత్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి అరకిలో బంగారాన్ని, 2 లక్షల 70 వేల రూపాయలు నగదును, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు.