ఇద్దరు ఎమ్మెల్యేలకు షాకిచ్చిన మంత్రి కేటీఆర్: ఏం జరిగిందంటే?
వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లాలోని మానుకోటలో రూ. 50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. మరోవైపు, పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
అయితే, ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించేందుకు వెళుతున్న కేటీఆర్తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయనపై ఆగ్రహంతో ఉన్న కేటీఆర్.. ఎమ్మెల్యే చేయిని తీసిపడేశారు. కేటీఆర్ సీరియస్గా అలా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తోపాటు అక్కడున్నవారంతా షాకయ్యారు.

మరోవైపు, పోడు పట్టాల పంపిణీ సభా వేదికపై కేటీఆర్కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. తిరస్కరించారు. సభాముఖంగా ఇలా జరగడంతో అవమానంగా భావించిన ఎమ్మెల్యే నరేందర్ వేదికపైగా చిన్నబోయి కూర్చున్నారు. అయితే, పట్టణంలో పర్యటించిన కేటీఆర్కు జర్నలిస్టులతోపాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో కేటీఆర్ కొంత అసహనానికి గురైనట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఇది ఇలావుండగా, పోడు భూములు పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పోడు భూములకు పట్టాలు మాత్రమే కాదు.. రైతుబంధు, రైతు బీమా కూడా అందుతుందన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా వస్తుందని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లాలో 24,281 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం తరపున ములుగులో గిరిజన వర్సిటీకి 360 ఎకరాల భూమి ఇచ్చామన్నారు. వర్సిటీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రధాని వరంగల్ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలన్నారు. ఉక్కు కర్మాగారం హామీ ఏమైంది? ఇచ్చిన మాట తప్పినందుకు ప్రధాని తెలంగాణకు క్షమాపణ చెప్పాలని అని కేటీఆర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications