30 ఏళ్లుగా రైతుకు అందని పరిహారం: ఆర్డీవో ఆఫీస్ సామాగ్రి జఫ్తుకు కోర్టు ఆర్డర్, గందరగోళం
వరంగల్: రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆర్డీవో కార్యాలయ సామగ్రిని జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు రైతులు వెళ్లారు. దీంతో గందరగోళం ఏర్పడింది.
1990లో రఘునాథపల్లిలో చెక్ డ్యాం నిర్మించేందుకు వెంకట్ రెడ్డి, చంద్రా రెడ్డి, యాదవ రెడ్డిలకు చెందిన 5.5 ఎకరాల్ని ప్రభుత్వం తీసుకుంది. దీనికి నష్ట పరిహారం రూ. 27.81 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ పరిహారం వారికి అందలేదు. దీంతో రైతులు కోర్టుకెక్కారు. న్యాయస్థానం కూడా నష్టపరిహారం చెల్లించాలని పలుమార్లు అధికారులను ఆదేశించింది. కానీ వారు పట్టించుకోలేదు.
దీంతో ఆర్డీవో కార్యాలయంలో ఉన్న సామగ్రిని జప్తు చేయాలని ఆ తర్వాత కోర్టు ఆదేశించింది. గురువారం ఉదయం రైతులు ఆర్డీవో కార్యాలయానికి వచ్చి, కంప్యూటర్, ఫర్నిచర్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఆర్డీవో రైతులకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. వారు వినలేదు. ఆ తర్వాత కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ కల్పించుకొని, వారం రోజుల్లో కొంత నష్టపరిహారం, నెల రోజుల్లో మొత్తం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు వెనక్కి తగ్గారు. సామాగ్రిని వారికి అప్పగించి వెళ్లారు.
దీనిపై బాధితులు మాట్లాడుతూ.. చెక్ డ్యాం పేరుతో బలవంతంగా తమకు చెందిన 5.5 ఎకరాలను లాక్కున్నారని, ముప్పై ఏళ్ల పాటు తమతో ఆడుకున్నారని వాపోయారు. మా భూములు మాకు ఉంటే ఇలా ఉండేవాళ్లం కాదని చెప్పారు. ఏదో పంట వేసుకొని బతికేవాళ్లమని చెప్పారు. మా జీవితమంతా ఆఫీసుల చుట్టు తిరగడానికే సరిపోయిందని తెలిపారు.