గొర్రెకుంట బావిలో 9 హత్యలు : దోషి సంజయ్కి ఉరిశిక్ష... వరంగల్ కోర్టు సంచలన తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల కేసులో జిల్లా సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్(24)ను దోషిగా తేల్చిన కోర్టు... అతనికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి కె.జయకుమార్ తీర్పు వెల్లడించారు. నిందితుడిపై అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిరూపించడంతో నిందితుడు సంజయ్ దీషిగా తేల్చబడ్డాడు. బీహార్కు చెందిన సంజయ్ కుమార్ ఈ ఏడాది మే 21న వరంగల్ శివారులోని గీసుకొండలో ఉన్న గొర్రెకుంట బావిలో తొమ్మిది మందిని జలసమాధి చేశాడు.

ఇలా వెలుగులోకి...
ఈ ఏడాది మే 21వ తేదీన గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ గోనె సంచుల గోదాం ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో ఐదు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. ఆ మరుసటిరోజు అదే బావి నుంచి 4 మృతదేహాలు బయటపడ్డాయి. మొదట ఆత్మహత్యలుగా భావించినప్పటికీ... ఆ తర్వాత ఇవన్నీ హత్యలేనని తేల్చారు పోలీసులు. మృతులను మక్సూద్ కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అందులో ఇద్దరు మక్సూద్ ఇంటి పక్కనే నివసించే ఇద్దరు బీహారీ యువకులుగా గుర్తించారు. మక్సూద్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న సంజయే ఈ హత్యలకు పాల్పడినట్లు నిర్దారించారు.

హత్యలకు కారణమేంటి...
గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో ఉన్న రెండు గదుల్లో మక్సూద్ కుటుంబం నివసిస్తోంది. ఆ పక్కనే ఇద్దరి బీహారీ యువకులు అద్దెకు ఉంటున్నారు. మక్సూద్ కుటుంబం చాలా ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడింది. ఈ క్రమంలో మక్సూద్ కుటుంబంతో సంజయ్కి పరిచయం ఏర్పడింది. మక్సూద్ మరదలు రఫీకాతో సంజయ్ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాడు. ఈ క్రమంలో పెళ్లి కోసం రఫీకా ఒత్తిడి చేయగా.. మొదట ఇంటికి తీసుకెళ్లి తమవాళ్లకు పరిచయం చేస్తానని ఓరోజు రైల్లో తన వెంట తీసుకెళ్లాడు. పశ్చిమ బెంగాల్ వెళ్దామని విశాఖ గరీబ్రథ్ రైలు ఎక్కించి... మార్గమధ్యలోనే రఫీకాను రైలు నుంచి తోసి హత్య చేశాడు.

ఇలా హత్యలకు స్కెచ్
సంజయ్ తిరిగి వరంగల్ వచ్చాక మక్సూద్ కుటుంబం రఫీకా గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. పోలీస్ కేసు పెడుతామని మక్సూద్,అతని భార్య బెదిరించడంతో సంజయ్ భయపడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొరికిపోతానన్న భయంతో ఆ కుటుంబం మొత్తాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఇదే క్రమంలో మే 20న మక్సూద్ ఇంట్లో జరిగిన అతని కుమార్తె బుష్రా కొడుకు(3) బర్త్ డే పార్టీకి సంజయ్ హాజరయ్యాడు. ఆ పార్టీకి వెళ్లేముందు వరంగల్ వెంకట్రామ థియేటర్ సమీపంలో తన స్నేహితుడైన మిద్దెపాక యాకూబ్,అంకూస్లను కలుసుకున్నాడు. అదే సమయంలో వరంగల్లోని నాలుగైదు మెడికల్ షాపుల నుంచి నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు.

ఒక్క హత్యను కప్పి పుచ్చేందుకు మరో 9 హత్యలు...
పార్టీకి వెళ్లిన తర్వాత పథకం ప్రకారం కూల్ డ్రింక్స్లో నిద్రమాత్రలు కలిపి అందరికీ ఇచ్చాడు. అవి తాగాక మక్సూద్ కుటుంబం,బీహారీ యువకులు,డ్రైవర్ షకీల్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం స్నేహితుల సహాయంతో సంజయ్ కుమార్ వారిని గోనె సంచుల్లో చుట్టి బావిలో పడేశాడు. నిజానికి తొలుత బిహారీ యువకులైన శ్యాం కుమార్షా(21), శ్రీరాం కుమార్షా(26) లను వదిలేద్దామని భావించినట్టు సంజయ్ విచారణలో వెల్లడించాడు. కానీ హత్యల విషయం వారి ద్వారా బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతో.వారిని కూడా హత్య చేసినట్టు అంగీకరించాడు. అలా ఒక్క హత్యను కప్పి పుచ్చుకోవడానికి మరో 9 మందిని సంజయ్ పొట్టనపెట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications