షర్మిలకు మరో షాక్ - పోలీసుల నుంచి నోటీస్తో..!!
వరంగల్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు పోలీసుల నుంచి ఎదురవుతోన్న ఇబ్బందులు ఇంకా వీడట్లేదు. అవి వెంటాడుతూనే వస్తోన్నాయి. పాదయాత్రకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. నర్సంపేట్ టీఆర్ఎస్ శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు, కార్యకర్తల దాడి వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన పాదయాత్రను పునఃప్రారంభించడానికి తేదీని నిర్ధారించుకున్నప్పటికీ అది సాధ్యపడట్లేదు.

షోకాజ్ నోటీసులు..
తాజాగా వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులు అందాయి. వరంగల్ పోలీసులు శనివారం రాత్రి ఆమెకు ఈ నోటీసులను జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు సంతృప్తికరమైన వివరణను ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించారు. పాదయాత్రను పునఃప్రారంభించడానికి అనుమతి కోరుతూ షర్మిల చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన అనంతరం వరంగల్ పోలీసులు ఈ షోకాజ్ నోటీసును జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు.

షోకాజ్లో ఏముంది?
పలు కీలక అంశాలను వరంగల్ పోలీసులు ఈ నోటీస్లో పొందుపరిచారు. వరంగల్ జిల్లా శంకరంతండా వద్ద దాడి జరగడానికి గల కారణాలను వివరించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు దిగొద్దంటూ ఇదివరకు షరతులతో కూడిన ఆదేశాలను ఉల్లంఘించడం వల్ల ఈ దాడి జరిగినట్లు భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు. తొలుత జారీ చేసిన షరతులను ఉల్లంఘించారని, ఇప్పుడు మళ్లీ అనుమతులను ఇస్తే అది పునరావృతం కావొచ్చని అంచనా వేస్తోన్నట్లు చెప్పారు.

అనుమతి ఎందుకు నిరాకరించకూడదు..
పాదయాత్ర కోసం చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించకూడదంటూ పోలీసులు వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణకు పాల్పడటం వల్ల జిల్లాల శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లినట్టయిందని పేర్కొన్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో పాదయాత్రకు తాత్కాలికంగా మరోసారి బ్రేక్ పడినట్టయింది. నోటీసుల వ్యవహారం పాదయాత్రకు ప్రతిబంధకంగా మారినట్లు వైఎస్ఆర్టీపీ నాయకులు చెబుతున్నారు.

పాదయాత్ర ప్రారంభించాల్సి ఉన్నా..
ఇవ్వాళ్టి నుంచి వైఎస్ షర్మిల తన పాదయాత్రను పునఃప్రారంభించాల్సి ఉంది. అది కాస్తా వాయిదా పడింది. మళ్లీ ఎప్పటి నుంచి దీన్ని చేపడతారనేది ఇంకా ఖరారు కాలేదు. షెడ్యూల్ ప్రకారం- ఈ ఉదయం 8 గంటలకు షర్మిల లోటస్పాండ్ ఇంటి నుంచి నర్సంపేట్కు బయలు దేరాల్సి ఉంది. ఇదివరకు దాడి చోటు చేసుకున్న ప్రదేశం నుంచే పాదయాత్రను పునః ప్రారంభించాల్సి ఉంది. అనూహ్యంగా వరంగల్ పోలీసుల నుంచి షోకాజ్ నోటీసులు రావడంతో దీనికి బ్రేక్ పడింది.

గవర్నర్ దృష్టికీ..
వైఎస్ షర్మిలపై వరంగల్ జిల్లాలో జరిగిన దాడి.. ఆమె అరెస్ట్- ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల చేసిన ప్రయత్నాలనూ పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు- జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశమైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లారు షర్మిల.

కొత్త సీపీ..
వైఎస్ షర్మిల అరెస్ట్ సమయంలో హైదరాబాద్ నగర జాయింట్ పోలీస్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా పని చేసిన ఏవీ రంగనాథ్.. ప్రస్తుతం వరంగల్ నగర పోలీస్ కమిషనర్గా ఉన్నారు. అప్పటివరకు వరంగల్లో పని చేసిన తరుణ్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. తరుణ్ జోషి స్థానంలో రంగనాథ్ అపాయింట్ అయ్యారు.












Click it and Unblock the Notifications