ఏయ్ జగన్.. నువ్వెవడివి మాకు చెప్పడానికి: ఆవేశంతో ఊగిపోయిన పవన్
ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంప తన విమర్శలు, ఆరోపణల తీవ్రతను మరింత పెంచారు. వాటికి మరింత పదును పెట్టారు. మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించడం, దానిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ.. వెనక్కి తగ్గలేదు.
మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఇదివరకు ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు. వలంటీర్లు తొలుత ఇళ్లపై రెక్కీలు నిర్వహిస్తోన్నారని, అనంతరం ఒంటరి ఆడపిల్లలను టార్గెట్ చేస్తోన్నారని మండిపడ్డారు.

ఇప్పుడు తాజాగా తణుకు సభలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై మరింత రెచ్చిపోయారు పవన్ కల్యాణ్. ఇంతకుముందు చెప్పినట్టే- వైఎస్ జగన్ను ఏకవచనంతో సంబోధించారు. మద్యం రేట్లను పెంచడాన్ని తప్పుపట్టారు. 60 రూపాయలు ఉండే మద్యాన్ని 160 రూపాయలకు పెంచాడని, మందుబాబుల కడుపు కొట్టావంటూ ధ్వజమెత్తారు.
అందుకే ప్రజల మధ్య తిరగలేక పరదాలు కట్టుకుని గాల్లో విహరిస్తున్నావంటూ మండిపడ్డారు. ఇక నుంచి తాను జగన్ను జగ్గూ భాయ్ అని పిలుస్తానని చెప్పారు. జగన్కు గల్ల లుంగీ, ఎర్ర చొక్కా, మచ్చ పెట్టానంటూ ఎద్దేవా చేశారు. జగన్ కొంపలు అంటిస్తాడు.. నేను గుండెలు అంటిస్తాను.. వైసీపీ కొంపలు అంటిస్తుంది, జనసేన గుండెలు అంటిస్తుంది.. అంటూ పవన్ కల్యాణ్ నినదించారు.
ఈ సందర్భంగా ఆయన జగన్ను ఏకవచనంతో సంబోధిస్తూ ఆవేశంతో ఊగిపోయారు. ఏయ్ జగన్.. నువ్వెవడివి మాకు చెప్పడానికి..అంటూ ధ్వజమెత్తారు. నువ్వెవడివి, నీ మంత్రులు ఎవరు, నీ ఎమ్మెల్యేలు ఎవరు, నీ పార్టీ ఏంటీ.. అంటూ పవన్ ఆవేశంతో ప్రశ్నించారు. తామందరం భారతీయులం, ఆంధ్రులమని పేర్కొన్నారు. రాజ్యాంగం, అంబేద్కర్ తమకు ఈ స్వాతంత్ర్యం ఇచ్చిందని చెప్పారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ కింద 1,100 కోట్ల రూపాయలను జగన్ దారి మళ్లించాడని పవన్ ఆరోపించారు. ప్రజల డబ్బును యథేచ్ఛగా దొంగతనం చేస్తోన్నాడని విమర్శించారు. తన మంత్రులు, ఎమ్మెల్యేలతో అందరినీ జగన్ బూతులు తిట్టిస్తుంటాడని, ఎవరు ప్రశ్నిస్తే వారిని అణగదొక్కేస్తున్నాడని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications