ప్రపంచకప్ ప్రారంభానికి ముందే బిగ్ షాక్- స్టార్ ఆల్రౌండర్ అవుట్
వెల్లింగ్టన్: ఐపీఎల్ అయిపోయింది.. ఉత్కంఠతను రేకెత్తించిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనలూ ముగిసింది. ఇక అందరి దృష్టీ ఐసీసీ ప్రపంచకప్ మీద నిలిచింది. ఇంకో నాలుగు నెలల్లో ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాబోతోంది. దీనికోసం అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్తో తీరిక లేని షెడ్యూల్స్ను ఎదుర్కొంటోన్నాయి.
ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. భారత్, వెస్టిండీస్ రెండుసార్లు ఈ కప్ను ముద్దాడాయి. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. 2019లో జరిగిన వరల్డ్ కప్ను ఇంగ్లాండ్ ఎగరేసుకెళ్లింది. ఈ సారి ఎవరు విన్నర్ అవుతారనేది ఆసక్తి రేపుతోంది.

మొత్తం 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అయ్యాయి. మరో మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యూఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్, ఐర్లాండ్.. ఈ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ నెల 18 నుంచి జులై 9వ తేదీ వరకు క్వాలిఫయర్ మ్యాచ్లను ఆడనున్నాయి.
కాగా- వరల్డ్ కప్ హీట్ ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో న్యూజిలాండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ మిఛెల్ బ్రేస్వెల్.. గాయం కారణంగా తప్పుకొన్నాడు. వరల్డ్ కప్కు అందుబాటులో ఉండట్లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. అతనికి తగిలిన గాయానికి ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
టీ20 బ్లాస్ట్ ఆడుతున్న సమయంలో అతను గాయపడ్డాడు. మడమ ఎముక చిట్లింది. దీనికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంది. దీనికోసం ఒకట్రెండు రోజుల్లో బ్రిటన్కు వెళ్లనున్నాడు బ్రేస్వెల్. అక్కడ సర్జరీ చేయించుకోనున్నాడు. రిహాబిలిటేషన్ కోసం కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలను కేటాయించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడీ స్టార్ ఆల్రౌండర్.
ఇప్పటికే కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం అయ్యాడు. తాజాగా బ్రేస్వెల్ కూడా వైదొలగడం న్యూజిలాండ్ జట్టును కష్టాల్లోకి నెట్టేసినట్టయింది. గత ఏడాది మార్చిలో వన్డే ఇంటర్నేషనల్స్లో అడుగుపెట్టిన బ్రేస్వెల్.. ఆల్రౌండర్గా జట్టులో కీలక పాత్ర పోషిస్తోన్నాడు. బ్యాట్, బంతితో సత్తా చాటుతున్నాడు. 19 వన్డేలను ఆడిన బ్రేస్వెల్ 510 పరుగులు చేశాడు. 118.60 స్ట్రైక్ రేట్తో దూకుడుగా సాగుతోంది అతని బ్యాటింగ్. 15 వికెట్లను పడగొట్టాడు.
భారత జట్టుపై హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బ్రేస్వెల్ సృష్టించిన పరుగుల సునామీని ఎవ్వరూ విస్మరించలేరు. 349 పరుగులు చేసిన టీమిండియా లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో బ్రేస్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 78 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సర్లు 12 ఫోర్లు ఉన్నాయి. భారీ పరుగులను అవలీలగా ఛేదించింది కివీస్.












Click it and Unblock the Notifications