కేసీఆర్ కు ఇక నిద్ర పట్టదు, సోనియా భిక్షతోనే, చరిత్ర పునరావృతం: నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ ప్రజా గర్జన సభ చూసిన తరువాత టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఇక నిద్ర పట్టదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు.
సంగారెడ్డి : కాంగ్రెస్ ప్రజా గర్జన సభ చూసి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఇక నిద్ర పట్టదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. గురువారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంకు ఘన చరిత్ర ఉందన్నారు. 1979 డిసెంబర్లో ఇందిరా గాంధీ సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఆ తరువాత 1980లో జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వచ్చారన్నారు.
ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి ఈ ప్రజా గర్జన సభే నాంది అన్నారు. 40 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ మనవడు రాహుల్.. మెదక్ గడ్డకు వచ్చారని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి... కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ భిక్షతోనే కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందన్నారు. కాంగ్రెస్ పై దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.
టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదని, కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే ఆ అధికారులు నిలవలేరని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ పతనం ఖాయమని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.