చికాగోలో తెలంగాణ నైట్
చికాగోలోని, ఆ నగరం పరిసరాల్లోని తెలంగాణ ప్రవాసభారతీయులు ఈ నెల 4వ తేదీన తెలంగాణ నైట్ 2006 నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టిడియఫ్) చికాగో చాప్టర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైంది. పూర్ణ అల్లంనేని స్వాగతం పలికారు. మంజు రెడ్డి కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు గ్లోరీ ఆఫ్ తెలంగాణ పేరుతో నిర్మించిన స్లయిడ్ షోతో మొదలయ్యాయి. ఈ స్లయిడ్ షోలో జయ జయహే తెలంగాణ అనే పాట వుంది. ఈ పాటలో తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని, గ్రామీణ, పట్టణ జీవన శైలిని, పండుగలను, జాతరలను పొందుపరిచారు. ఈ పాట శ్రోతలను పూర్వ స్మృతుల్లోకి లాక్కెళ్లి తన్మయులను చేసింది.
అనంతరం నిశు, అలేఖ్య నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీను పాల్తెపు టిడియఫ్ - యుయస్ఎ చరిత్రను సంక్షిప్తంగా తెలియజేస్తూ అది సాధించిన లక్ష్యాల గురించి వివరించారు. టిడియఫ్ రాజకీయాలతో సంబంధం లేని లాభాపేక్ష రహిత సంస్థ అని ఆయన చెప్పారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, తెలంగాణకే ప్రత్యేకమైన అంశాల గురించి మాట్లాడుతుందని ఆయన చెప్పారు.
ఆ తర్వాత భరత నాట్యంలోని అభంగ్, థిల్లానా ప్రదర్శన జరిగింది. సుమన్ ఆదిశేషు ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. రాజేశ్వరరావు లింగంపల్లి గ్రామీణ గ్రంథాలయాలపై, కంటి పరీక్ష శిబిరాలపై దృష్టి కేంద్రీకరిస్తూ టిడియఫ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అశోక్, రవిచంద్ర తోకల గేయాలు ఆలపించారు. భోజనం తర్వాత స్టిల్ సీకింగ్ జస్టిస్ - ఎ స్టోరీ ఆఫ్ తెలంగాణ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications