ఎన్నారైలతో పెళ్లిళ్లు పెటాకులు?
ఆ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం - సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో, ప్రపంచీకరణ పుణ్యంతో చాలా మంది స్థానిక యువకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో పనిచేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన స్థానిక ఎన్నారైలను, ముఖ్యంగా కంప్యూటర్ ప్రొఫెషనల్స్ను అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఉత్తర, దక్షిణ అమెరికాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న అబ్బాయిలను అమ్మాయిలు వివాహమాడుతున్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళలకు చెందిన ఎన్నారైలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తమ భార్యలను మధ్యలోనే వదిలేస్తున్న ఎన్నారైల సంఖ్య భారతదేశంలో పెరుగుతోందని, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. దీనికి మతం, ప్రాంతం, కులం వంటి తేడాలు ఏమీ లేవు.
ఎన్నారై భర్తల చేతిలో మోసపోతున్నవారిలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 60 శాతం ఉన్నారు. 31 - 35 మధ్య వయస్సు గల మహిళలు 17.6 శాతం ఉన్నారు. ఎన్నారై భర్తలు వదిలేసిన మహిళల్లో 35 శాతం మంది హిందువులు కాగా, 14 శాతం మంది ముస్లింలు, 3 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు.
మహిళల్లో 90 శాతం మందికి భర్తలతో వరకట్నం సమస్యను ఎదుర్కుంటున్నారు. భార్యలను ఎన్నారై భర్తలు వదిలేయడానికి ప్రధాన కారణం వరకట్నమే అవుతోంది. కొంత మంది ఎన్నారై యువకులు తాము బడా కంపెనీల్లో పనిచేస్తున్నామంటూ స్థానిక యువతులను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నట్లు తేలింది. కొంత మంది ఇది వరకే పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచేసి మళ్లీ ఇక్కడి మహిళలను పెళ్లి చేసుకున్నట్లు కూడా తేలింది. ఎన్నారై భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారా, లేదా అనే విషయాన్ని పెళ్లికి ముందు నిర్ధారించుకోలేదని మహిళలు చెప్పారు.
అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలకు చెందిన 52 మంది భర్తలతో విడిపోయిన మహిళలను ఇంటర్వ్యూ చేసింది. వీరిలో 21 మందికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రాలేదట.