లోక్సత్తా తొలి సదస్సు అదుర్స్
న్యూజెర్సీ: అమెరికాలోని లోక్సత్తా మద్దతుదారుల సంస్థ అయిన "పీపుల్ ఫర్ లోక్సత్తా" ఆధ్వర్యం లో తొలి సదస్సు న్యూజెర్సీ నగరంలో జరిగింది. ఇందుకోసం అమెరికాలోని 10 రాష్ట్రాలకి చెందిన దాదాపు 70 మంది ప్రతినిధులు సదస్సుకు వచ్చారు. మొదటి రోజు " రివైవింగ్ సోషల్ లెగసి" అనే అంశం మీద భారత సంతతి విద్యార్థులకి వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో తెలుగువాళ్ళందరికి సుపరిచితుడైన రాజకీయవేత్త, న్యూజెర్సీ అసెంబ్లీ ప్రతినిధి ఉపేంద్ర చివుకుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ - నెల్లూరు జిల్లాలోని పేదకుటుంబం నుండి అమెరికా వరకు వచ్చానని, ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చిన తరువాత తన చుట్టూ ఉన్న సమాజం నాది అన్న బాధ్యతతో, సామజిక సేవకి రాజకీయాలని ఎంచుకున్నానని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత తానీ స్థాయికి వచ్చానని, నిరతర కృషి, నిబద్దత, నిజాయితీగా పని చెయ్యడం వల్ల ఇది అందరికి సాధ్యం అవుతుందని అయన తెలిపారు. కానీ నేటి తరాన్ని చూస్తుంటే వాళ్ళ సామజిక అవగాహనా, సేవాభావం చిన్నవయసు నుండే పెంపొందించు కోవడం సమాజం దేశ అభివృద్ధికి చాలా దోహదపడుతుందని తెలిపారు.
పీపుల్ ఫర్ లోక్సత్తా నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన రజని మాట్లాడుతూ - మన సమాజం, పరిసరాలు అన్ని కూడా రాజకీయాల వల్లనే మెరుగవుతాయని,నరాజకీయాల్ని ద్వేషించకుండా, రాజకీయాల గురించి నిశితంగా పరిశీలించాలని, రాజకీయాల గురించి చర్చించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువత రాజకీయాల్ని గురించి పట్టించుకోవాలని అన్నారు.
సభని సురేష్ ఈడిగ సమన్వయపరిచారు. మద్దతుదారుల పరిచయం తరువాత లోక్సత్తాలో ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత పీపుల్ ఫర్ లోక్సత్తా మీడియా అధికార ప్రతినిధి దినేష్ పగడాల, శ్రీకాంత్ కోచార్లకోట ఆధ్వర్యంలో సంస్థకు చెందిన వీడియోలను ప్రదర్శించారు. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా సమాచార విప్లవం ఎలా పెరుగుతోంది, వాటిద్వారా ఎలా వేగంగా ప్రజలని చేరుకోవచ్చు అనే విషయాలను వివరించారు. లోక్సత్తాకు అందించవలసిన మీడియా సహాయాన్ని కూడా తెలిపారు.
అనంతరం సందీప్ పట్టెం తాను రూపొందించిన నియోజకవర్గం ప్రమోషన్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ప్రస్తుతం నాలుగు నియోజక వర్గాలకి నలభై మంది ఎన్నారై లు సహాయం అందిస్తున్నారని చెప్పారు రాయదుర్గం, వైజాగ్ గురించి ప్రకాష్ కపిల, సనత్ నగర్ పై ప్రదీప్, మల్కాజ్గిరిపై స్రవంతి యలమంచిలి ఒక నివేదిక అందించారు. ప్రస్తుత రాజకీయాలకు నిధుల అవసరాన్ని ఉందని, నీతివంతమైన పార్టీలకి డబ్బు ఇవ్వడం తమ ధర్మంగా ప్రజలు ఆలోచించాలని తెలిపారు.
శ్రీకాంత్, మానస, శ్రీనివాస్ గొల్లపల్లి కూడా నిధులని సమీకరించడానికి అవసరమైన కొన్ని మార్గాలను తెలిపారు. పీపుల్ ఫర్ లోక్సత్తా నుండి లోక్సత్తా పార్టీ కి పూర్తిగా పని చేస్తున్న హైమా ప్రవీణ్, దిలీప్ శంకర్ రెడ్డి , పద్మ భూపతిరాజులకు సభ్యులు తమ పూర్తి మద్దత్తునిచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు. హైమా ,పద్మ, శంతలదమలెల స్ఫూర్తితో తానూ త్వరలో భారత దేశం వెళ్లి లోక్సత్తా కోసం పనిచేయాలని అనుకుంటున్నట్లు 24 సంవత్సరాల బ్రాహ్మణి బొప్పూడి తెలిపారు.
చివరగా యువత సదస్సు జరిగింది. ఇందులో భాగంగా 35 ఎళ్ల లోపు యువతని ప్రభావితం చేస్తున్న వివిధ రాజకీయంశాలపై చర్చించారు. కృష్ణ బూరుగుపల్లి మాట్లాడుతూ - యువతకి అసలు సిసలు ప్రాధాన్యం ఇచ్చేది లోక్సత్తా మాత్రమే అని తెలిపారు. గత రెండేళ్ళ నుండి పలు పీపుల్ ఫర్ లోక్సత్తా కార్య క్రమాల్లో పాలుపంచుకుంటూ శ్రమకోర్చిన 20 మంది సభ్యులకి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
పీపుల్ ఫర్ లోక్సత్తా ప్రస్తుత అధ్యక్షకుడు, సంస్థ వ్యవస్థాపక సభ్యుడు ప్రసన్న మేధా, దండి మార్చ్ 2 రూపకర్త జవహర్, సంస్థ కీలక సభ్యుడు రాఘవ రెడ్డి సోలిపురంలకు సర్టిఫికెట్లు ఇచ్చారు.