న్యూయార్క్లో ఎంపీలకు సత్కారం
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో 12 మంది భారత పార్లమెంటు సభ్యులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సత్కారం జరిగింది. ఈ సత్కార కార్యక్రమానికి ఈ నెల 25వ తేదీన సుబ్బారావు అనుమోలు ఆతిథ్యం ఇచ్చారు. సిఎం రమేష్ (ఆంధ్రప్రదేశ్), షాదీలాల్ బాత్రా (హర్యానా), భరత్ కుమార్ రౌత్ (మహారాష్ట్ర), భువనేశ్వర్ కలిత (అస్సాం), పూనం జాట్ (గుజరాత్), స్మృతి ఇరానీ (గుజరాత్), వివేక్ గుప్తా (పశ్చిమ బెంగాల్), వైయస్ చౌదరి (ఆంధ్రప్రదేశ్), హరీష్ చౌదరి (రాజస్థాన్), మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), రమేష్ చంద్రన్ (కేరళ), మద్నోర్ విపిఎస్ (రాజస్థాన్)లకు తానా ఆధ్వర్యంలో ఆ సత్కారం జరిగింది.

న్యూ హావెన్లోని యాలే విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటైన లీడర్షిప్, మేనేజ్మెంట్ శిక్షణా కార్యక్రమం కోసం వారు అమెరికా వచ్చారు. తానా విజ్ఝప్తిని మన్నించి సత్కార కార్యక్రమానికి వచ్చారు. వారిని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని వారు అంగీకరించారు. విజయవాడకు చెందిన అనుమోలు సేవలను, కృషిని ఆయన ఎంపీలకు వివరించారు.
కార్యక్రమంలో మొదటగా అనుమోలు వేదిక మీదికి ఎంపిలకు ఆహ్వానించారు. ఉత్తరాఖండ్ వరదల్లో మరణించినవారికి ఎంపిలందరి తరఫున స్మృతి ఇరానీ సంతాపం ప్రకటించారు. సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. పార్లమెంటు సభ్యులు కార్యక్రమంలో ప్రసంగించారు. భారత భవిష్యత్తును తాము చూస్తున్న తీరుపై వారు వివరించారు. శాలువాలు, మెమెంటోలతో తానా పార్లమెంటు సభ్యులను సత్కరించింది.
వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మల్లారెడ్డి పైల్ల, డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ ఆజాద్ ఆనంద్, ఉపేంద్ర చివుకుల, బాబీ కుమార్, బ్రహ్మాజీ వలివేటి వారిలో ఉన్నారు. తానా ఫౌండేషన్ చైర్మన్ జయశంకర్ తాళ్లూరి వందనసమర్పణ చేశారు.












Click it and Unblock the Notifications