గరంమసాల బర్గర్: భారత చిన్నారికి ఒబామా ప్రశంసలు(ఫొటోలు)
వాష్టింగ్టన్: ఒబామా దంపతులకు క్వినోవా అనే గరంమసాల బర్గర్ రుచి చూపించిన తొమ్మిదేళ్ల భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి శ్రేయా పటేల్ ‘కిడ్స్ స్టేట్ డిన్నర్' అనే కార్యక్రమానికి ఎంపికయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ కార్యక్రమాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ నిర్వహిస్తున్నారు.
నేషనల్ హెల్తీ లంచ్టైమ్ ఛాలెంజ్ ద్వారా ఈ పోటీకి దాదాపు వెయిమంది చిన్నారులు హాజరయ్యారు. వారి నుంచి మొత్తం 55 మందిని తుది జాబితాకు ఎంపిక చేశారు. జిలకర, అల్లం లాంటి ఇతర దినుసులు కలిపి తయారు చేసిన గరం మసాలను దట్టించి బర్గర్ను శ్రేయా తయారు చేసింది. దానికి తోడుగా రైతా (పెరుగుపచ్చడి)ను అందించింది.
వైట్హౌస్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రేయా టేబుల్ వద్దకు వచ్చిన ఒబామా, ఆమె తయారు చేసిన బర్గర్ను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ‘నీ సృజనాత్మకత, టాలెంట్తో జడ్జీలను ఆకట్టుకున్నావు. అన్ని రంగులు కనపడే విధంగా ఫలాలు, కూరగాయల ముక్కలను పేర్చి హరివిల్లులా అలకరించావు. అన్ని రకాలు దినుసులను చేర్చి బర్గర్ను రుచికరంగా తయారు చేశావు' అని శ్రేయాను ఒబామా ప్రశంసలతో ముంచెత్తారు.
స్థూలకాయంతో బాధపడే పిల్లలను ఆదుకోవడంలో భాగంగా మిషెల్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో శ్రేయా ఒక్కరే భారత సంతతికి చెందిన చిన్నారి కావడం విశేషం. కాగా, ‘మా అమ్మమ్మ, అమ్మ చేసే వంటలను చూసి నేర్చుకున్నానని, మూడేళ్ల వయస్సు నుంచే వంటగదిలో సహాయం అందిస్తున్నాను' అని శ్రేయా ఈ సందర్భంగా తెలిపింది.