కువైట్లో తెలుగువాసి మృతి: స్వగ్రామానికి మృతదేహం
కువైట్: కువైట్లో అనారోగ్యంతో మృతి చెందిన తెలుగు వ్యక్తి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అక్కడి తెలుగుదేశం సేవా విభాగం సహాయసహకారాలను అందించింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రైల్వే కోడూరు వాసి యామల చంద్రయ్య కుటుంబం ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నివాసం ఉంటుంది. కువైట్లో భవన కార్మికునిగా పనిచేస్తూ చంద్రయ్య(49) గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. కాగా, ఇతనికి ఇద్దరు పిల్లలు.
పేద కుటుంబం నుంచి వచ్చిన చంద్రయ్య మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. చంద్రయ్య మరణ వార్తను తెలుసుకొన్న నెల్లూరు జిల్లా వేంకటగిరి శాసనసభ్యులు కురుగుంట్ల రామకృష్ణ నాయుడు తెలుగుదేశం-కువైట్ వారితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడాని కావలిసిన ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరారు.
ఈ నేపథ్యంలో చంద్రయ్య మృతదేహాన్ని అతని ఇంటికి చేర్చుటకు కావలసిన డాక్యుమెంటేషన్ను కువైట్ తెలుగుదేశం సేవా విభాగం పూర్తి చేసి, దగ్గరుండి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్కు తరలించారు. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి తమవంతు సాయంగా రూ. 2లక్షల ఆర్ధిక సాయాన్ని కూడా అందించారు.
ఆ మొత్తం చెక్కును మృతిని బందువుకు అందచేశారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని మనదేశానికి తరలించడానికి కువైట్లోని ఇండియన్ ఎంబసి తమ పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలుగుదేశం-కువైట్ విభాగం ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయుడు వేగి తెలిపారు.
కాగా, మృతదేహాన్ని ఇండియా కు తరలించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆర్ధిక సహాయం చేసిన తెలుగుదేశం-కువైట్ గౌరవ సలహాదారులు రావెల్ల సుబ్బారాయుడు(బాబు నాయుడు), కాపెర్ల పట్టాభి రాము నాయుడు, నల్లాని సురేష్ నాయుడు అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయుడు వేగి, మామిల్ల రాజ, గాజుల నాగయ్యలను ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ నాయుడు అభినందించారు.