రోడ్డు ప్రమాదం: సౌదీలో తెలుగు వ్యక్తి మృతి
రివాద్/ఆదిలాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లాలోని మామడ మండలం పోతారం గ్రామానికి చెందిన పందెన ముత్తన్న(35) మృతి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల 6 నెలల క్రితం సౌదీ వెళ్లిన ముత్తన్న అక్కడి అల్మీతహలియ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా పనికి వెళ్లి తిరిగి వస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సిగ్నల్ సమీపంలో సైకిల్పై రోడ్డు దాటుతున్న ముత్తన్నను ఓ కారు ఢీ కొట్టింది. దీంతో ముత్తన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ముత్తన్న మరణవార్తను అక్కడి వారు అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ముత్తన్న మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ముత్తన్న మృతితో ఆ కుటుంబసభ్యులు ఇంటి పెద్దదిక్కు కోల్పోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతునికి భార్య శంకరమ్మ, కూతురు సంధ్యారాణి, కొడుకు ప్రసాద్ ఉన్నారు.