వన్ స్టాప్ సొల్యూసన్: ప్రవాసుల కోసం 'స్వదేశం' సేవలు ప్రారంభం
హైదరాబాద్: ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా మహరాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు.. స్వదేశం వెబ్సైట్ www.swadesam.com ప్రారంభించారు. భారత్ నుంచి ఎన్నారైలకు సేవలు అందించేందుకు ఈ డిజిటల్ ఫ్లాట్ఫాం వారధిగా మారడం అభినందనీయమని విద్యాసాగర్రావు ప్రశంసించారు. ప్రవాస భారతీయులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించాలని ఆయన సూచించారు.
స్వదేశం టీమ్ను ఈ సందర్భంగా అభినందించారు. ప్రవాస భారతీయులు.. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని విద్యాసాగర్ రావు కొనియాడారు. అన్ని రంగాల్లోనూ ప్రవాస భారతీయులు రాణిస్తున్నారన్నారు.
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. భారత్ నుంచి తమకు కావాల్సిన సేవలను అందించేందుకు 'స్వదేశం' ప్రారంభమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. 'స్వదేశం' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, ఎన్నారై వేణు నక్షత్రం, మీడియాబాస్ సీఈవో స్వామి ముద్దం, స్వదేశం డైరెక్టర్ స్వాతి దేవినేని,ఎన్నారై అవంతిక, ఎన్నారై ప్రవీణ్ దొడ్డ, అశోక్ దయ్యాల, బైరి వెంకటేశం, రాయల లక్ష్మినర్సయ్య, వికాశ్, సునీల్, ఎమ్మెన్నార్ గుప్త, ప్రభాకర్లతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ఎన్నారైలు పాల్గొన్నారు.
ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వివిధ దేశాల్లో ఎంతో మంది భారతీయులు స్థిరపడ్డారు. వారికి భారత్ నుంచి ఎన్నో రకాల సర్వీసులు అవసరం అవుతుంటాయి. ఆ సేవలు పొందెందుకు దగ్గరివారికి లేదా తెలిసినవారిని సంప్రదిస్తారు. అయితే ఒక్కోసారి వారు కూడా అందుబాటులో ఉండరు. ఇలాంటి సమస్యలు చాలామంది ఎన్నారైలు ఎదుర్కొంటున్నారు. వారందరికీ 'స్వదేశం' (swadesam) వన్ స్టాప్ సొల్యూసన్ అని 'మీడియాబాస్ నెట్వర్క్' సంస్థ నిర్వహకులు తెలిపారు.
56 దేశాల్లోని ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎన్నారైలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సేవలు అందిస్తున్నామని, త్వరలో ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుంచి కూడా తమ సేవలు విస్తరించే ప్రక్రియ చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 3 కోట్ల 20 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారని, ఏటా దేశం నుంచి 25 లక్షల మందికి పైగా విదేశాలకు వలస పోతున్నారని వారందరికి అవసరమైన సేవలను అందించేందుకు 'స్వదేశం' సిద్దంగా ఉందని మీడియాబాస్ సీఈవో స్వామి ముద్దం చెప్పారు.
'స్వదేశం' సర్వీసుల్లో మీడియా కంటెంట్, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, లీగల్, ప్రాపర్టీ వ్యవహరాలు, రిజిస్ట్రేషన్లు, ఫ్రీలాన్స్ ఉద్యోగులు, వస్తువుల డెలివరీ, సెలబ్రెటీ మేనేజ్మెంట్, మాట్రిమోనీ సేవలు, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ సర్వీసులు.. వంటి ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్నారైలకు ఎలాంటి సర్వీసులు కావాలన్నా వెబ్సైట్లోని ఫామ్లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.