తెలుగులో వంద మార్కులు
సుమారు 48 గంటల క్రితం .. హైదరాబాద్ లో, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 85 వ "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం, మాతృభాషా దినోత్సవం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన డిగ్రీ కళాశాల పరీక్షలలో తెలుగులో అసాధ్యం అనుకునే నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుని చరిత్ర సృష్టించిన రావుల మంజుల అనే విద్యార్ధినికి ఆత్మీయ సత్కారం జరిగింది. గొర్రెల కాపరి వృత్తిలో ఉండి, ఎన్నడూ ఏ నగరాన్నీ చూడని ఆమె తల్లిదండ్రులు, గురువు కందుకూరి శ్రీరాములు సమక్షంలో హై కోర్ట్ జస్టిస్ రామలింగేశ్వర రావు చేతుల మీదుగా ఆమెకు తెలుగు వెలుగు పురస్కారాన్ని అందజేశారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ నగరాలలో కంటే గ్రామీణ ప్రాంతాల లోనే తెలుగు భాష పరిరక్షించబడుతోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం తమ ప్రకటనకు స్పందించిచి మంజులకు ఆశీస్సులు, అభినందనలు అంద జేసిన అమెరికా, ఇంగ్లండ్, ఆస్టేలియా, భారత దేశ ప్రముఖుల పేర్లతో ఒక కాంస్య ఫలకం మంజులకు బహూకరించినట్లు హ్యూస్టన్లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రతినిధి వంగూరి చిట్టెన్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.
మంజుల విద్యాభ్యాసం పూర్తి అయ్యేవరకూ ఆమె కళాశాల, వ్యక్తిగత జీవనానికీ అయ్యే ఖర్చు తామే సమకూరుస్తామని ఈ సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ప్రకటించింది. ప్రేక్షకుల నుండి తక్షణ స్పందనగా మంజులకు ఐదు వేల రూపాయలు పారితోషికం లభించడం ముదావహం. తన సత్కారానికి కృతజ్జతలతో స్పందిస్తూ ప్రభుత్వం వారు నిరుడు తనకి ప్రకటించిన వెయ్యి నూట పదహార్లు యింకా అంద లేదని రావుల మంజుల తెలిపారు.
వంశీ రామరాజు సభాధ్యక్షులుగా హైదరాబాద్లోని శ్రీ త్యాగరాజ గాన సభ ప్రాంగణంలో కళా సుబ్బా రావు కళా వేదిక పై జరిగిన ఈ కార్యక్రమంలో డా. ద్వానా శాస్త్రి, బైస దేవదాస్, కళా దీక్షితులు తెన్నేటి సుధా దేవి పాల్గొన్నారు.