చిరును ఆపిన ఎన్నారైపై ప్రశంసలు
హైదరాబాద్: క్యూను దాటేసి ఓటు వేయడానికి ప్రయత్నించిన కాంగ్రెసు నేత, మెగాస్టార్ చిరంజీవిని నిలదీసిన ఎన్నారై ఓటరు రాజా కార్తిక్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హైదరాబాదులోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యులతో ఓటు వేయడానికి వచ్చిన చిరంజీవి క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో రాజా కార్తిక్ చిరంజీవిని నిలదీశారు.
తాను లండన్ నుంచి ఓటేయడానికి వచ్చానని, క్యూలో గంట నుంచి నిలబడి ఉన్నానని రాజా కార్తిక్ చిరంజీవితో అన్నారు. మిమ్మల్ని ప్రత్యేకంగా చూడాలా, మీరు కేంద్ర మంత్రి అయితే కావచ్చు, కానీ మీరు సీనియర్ సిటిజన్ కారు, క్యూను దాటేసి వెళ్లడం సరి కాదని ఆయన చిరంజీవితో అన్నారు.
తన ఉద్దేశంతో అలా వెళ్లాలని కాదని చిరంజీవి సర్ది చెప్పారు. తాను నిబంధలను ఎప్పుడూ ఉల్లంఘించబోనని చిరంజీవి అన్నారు. తన పేరు ఓటర్ల జాబితాలో చూసుకోవడానికి వెళ్లానని చిరంజీవి చెప్పారు. తాను చిరంజీవిని గౌరవిస్తానని,త , అయితే చిరంజీవి కూడా క్యూలో రావాలని కార్తిక్ అన్నారు.
కార్తిక్ చిరంజీవిని అడ్డుకోవడంతో మిగతావాళ్లు చప్పట్లు కొట్టారు. ఇది చిరంజీవిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ సంఘటన మెక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది.