సాఫ్ట్బ్యాంక్ అధిపతిగా మనోడు: ఏడాదికి రూ.850కోట్లు
టోక్యో/న్యూఢిల్లీ: భారతదేశంలో పుట్టి పెరిగిన గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ నికేశ్ అరోరా (47).. ప్రస్తుతం జపాన్లోని బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ కార్పొరేషన్ అధిపతిగా నియమితులయ్యారు. అన్ని రకాల భత్యాలు కలిపి ఆయన వార్షిక వేతనం 16.556 బిలియన్ యెన్లు (135 మిలియన్ అమెరికన్ డాలర్లు, లేదా సుమారు రూ.850 కోట్లకు సమానం).
కాగా, ఇంత భారీ స్థాయిలో వేతనం లభించడం అరుదని జపాన్ మీడియా పేర్కొంది. గత సెప్టెంబరులోనే అరోరా ఈ బ్యాంకులో ఉపాధ్యక్షునిగా చేరారు. తక్కువ వ్యవధిలోనే స్నాప్డీల్, ఓలా క్యాబ్స్ వంటి సంస్థలతో 200 బిలియన్ యెన్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
నూతన అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా ఆయన నియామకాన్ని బ్యాంకు వాటాదారుల సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. కాగా, అరోరా.. వారణాసి ఐఐటిలో 1989లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు.
ఆ తర్వాత ఎంఎస్, ఎంబిఎ చేశారు. ఆయన భార్య ఆయేషా థాపర్. 1992లో ఫిడెలిటీ ఇన్వెస్టిమెంట్స్లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన అరోరా, 2012-14 మధ్య కాల్గేట్ పామోలివ్ కంపెనీలో డైరెక్టర్గా వ్యవహరించారు. గూగుల్లో ముఖ్య వ్యాపార అధికారిగా , సన్ సంస్థలోనూ సేవలందించారు.