సింగపూర్లో భారత యువకుడి దారుణ హత్య
సింగపూర్: పశ్చిమ కోస్తా సింగపూర్ ప్రాంతం పండాన్ పారిశ్రామికవాడలో ఓ భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశ్రామిక వాడలో విధులు నిర్వహిస్తున్న సురేష్(26) శనివారం తను పని చేస్తున్న చోటుకు సమీపంలోనే అపస్మారక స్థితిలో పడిపోయి వున్నాడు.
స్థానికుల సమాచారంతో ఆస్పత్రికి తరలించిన వైద్యులు, సురేష్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సురేష్ మృతి చెందాడని శనివారం రాత్రి 10.53ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సురేష్ మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, అతనిది హత్యగా నిర్ధారించారు.
సురేష్ ఘటనా స్థలంలో రక్త మరకలతో ఉన్నాడని సింగపూర్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అతడి తల, మెడ, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. అతడిపై ఎవరో దాడి చేసి తీవ్రంగా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, మృతుడు 2009 నుంచి ఒక షిప్ సర్వీసింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. సురేష్ కుమార్ ముక్కు సూటిగా ఉంటాడని, కష్టపడే మనస్తత్వమని సంస్థ ఆపరేషన్స్ మేనేజర్ వాంగ్బూన్ తెలిపారు. తన సహోద్యోగులతో స్నేహంగా ఉంటాడని తెలిపారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన చెప్పారు. తన సోదరిడి(30) సహాయంతో సురేష్ సింగపూర్ వచ్చాడు. సురేష్ తల్లిదండ్రులు భారతదేశంలోనే ఉన్నారు.