21న తెలంగాణ సాహిత్యంపై చర్చ
తెలంగాణ రచయితల సంఘం సింగిడి ఆవిర్భావ సదస్సు ఈ నెల 21వ తేదీ ఆదివారం హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సదస్సులో చర్చిస్తారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అణచివేతకు గురైన కారణాల్ని వివరించుకుంటున్నా, తెలంగాణ వాదం మొదలై ఏండ్లు గడుస్తున్నా... మన ప్రత్యేకతల్ని స్థిరీకరించుకోనే లేదని, కోస్తాంధ్ర మూసలోనే మన సాహిత్యం విమర్శ లేకపోలేదని, తెలంగాణ నుంచి వస్తున్న అసలు సాహిత్యం తెలంగాణ అస్తిత్వ ఉద్యమంతో పాటు వస్తున్న ఇతర అస్తిత్వ ఉద్యమాలదేనని, దీన్ని గురించే ప్రయత్నం సమగ్రంగా జరగడం లేదని సింగిడి కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.
సింగిడి ప్రారంభ సభను రవ్వా శ్రీహరి ప్రారంభిస్తారు. బి. నరసింగరావు అధ్యక్షత వహిస్తారు. జయధీర్ తిరమల రావు, పద్మశ్రీ జిలానీ బానో, డా. బోయ జంగయ్య, బంగ్యా భూక్యా, సూర్యానాయక్ గౌరవ అతిథులుగా పాల్గొంటారు. తొలి సెషన్ తెలంగాణ అస్తిత్వం, సాహిత్యంపై జరుగుతుంది. ఈ సెషన్ లో తెలంగాణ భాష, చారిత్రక, సాంస్కృతిక అస్తిత్వంపై కె. శ్రీనివాస్, తెలుగు సాహిత్య చరిత్ర, విమర్శ - తెలంగాణపై డా ఎస్వీ రామారావు తెలంగాణ ప్రాపంచిక దృక్కోణంపై కాసుల ప్రతాపరెడ్డి ప్రసంగిస్తారు.
రెండో సెషన్ లో తెలంగాణ స్త్రీల సాహిత్యంపై చర్చ జరుగుతుంది. దళిత స్త్రీల సాహిత్యంపై జె. సుభద్ర, ముస్లిం స్త్రీల సాహిత్యంపై షాజహానా ప్రసంగిస్తారు. ముదిగంటి సుజాతా రెడ్డి అధ్యక్షత వహిస్తారు. మూడో సెషన్ తెలంగాణ దళిత, బహుజన సాహిత్యంపై జరుగుతుంది. తెలంగాణ దళిత సాహిత్యంపై జిలుకర శ్రీనివాస్, తెలంగాణ బహుజన సాహిత్యంపై కాలువ మల్లయ్య ప్రసంగిస్తారు. నాలుగో సెషన్ తెలంగాణ ముస్లిం, గిరిజన సాహిత్యంపై జరుగుతుంది. తెలంగాణ ముస్లిం వాద సాహిత్యంపై సయ్యద్ ఖుర్షీద్, తెలంగాణ లంబాడా సాహిత్యంపై సిల్మా నాయక్ మాట్లాడుతారు. తెలంగాణ కోయ భాష, సాహిత్యంపై అనసూయ ప్రసంగిస్తారు.
ఐదో సెషన్ తెంలగాణ సాహిత్యం - శ్రామిక వర్గ అస్తిత్వంపై జరుగుతుంది. అల్లం నారాయణ, గుడిపాటి ప్రసంగాలు ఉంటాయి. ఆరో సెషన్ తెలంగాణ కళల అస్తిత్వంపై జరుగుతుంది. తెలంగాణ పాటపై గోరటి ఎంకన్న, తెలంగాణ చిత్రకళపై ఎ. షరీఫ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జరిగే కవిసమ్మేళనానికి జింబో అధ్యక్షత వహిస్తారు. గూడ అంజయ్య, అందెశ్రీ, సంధ్య, అశోక్ మోరె, నిసార్, బైరెడ్డి కృష్ణారెడ్డి వంటి గాయకులు, వాగ్గేయకారులు పాటలు వినిపిస్తారు. ఈ సదస్సులో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబ, సంగిశెట్టి శ్రీనివాస్, పసునూరి రవీందర్ వంటి వారు కూడా పాల్గొంటారు. ఆర్. కిషన్ రావు, బి.ఎస్. రాములు, రుక్నుద్దీన్, ఎస్వీ సత్యనారాయణ తదితరులు ఆయా సెషన్లకు అధ్యక్షత వహిస్తారు.












Click it and Unblock the Notifications