అమెరికాలో గురజాడ స్మరణ

Gurazada Jayanthi in USA
డాల్లస్ ఫోర్ట్ వర్త్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 62 వ సదస్సు,సెప్టెంబర్ 16, ఆదివారం అర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెష్టారెంటులో టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి, తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన వైభవంగాగా జరిగినది. ఈ సందర్బంగా నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు గారిని స్మరించుకున్నారు. అయన జీవిత విశేషాలను, అయన చేసిన ప్రగతి శీల రచనలను చర్చించుకున్నారు.

సాహిత్యం అనే సాధనంతో సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి అయన రచించిన "కన్యాశుల్కం" నాటిక ఈనాటికీ చాల ప్రసిద్ది చెందింది. ఈ సందర్భం గా సాహిత్య వేదిక సభ్యులందరూ కలిసి గురజాడ అప్పారావు రాసిన "దేశమును ప్రేమించుమన్న" అనే గేయాన్ని స్వయంగా పాడి, ఆహ్వానితులందరిని అలరించారు. అలాగే, గత మాసం ఆగస్టు, సెప్టెంబర్ లలో పరమపదించిన ప్రముఖ సాహితీ దిగ్గజాలకు ప్రగాడ సంతాపం వ్యక్తం చేసారు.

తెలుగు భాష కు ఎంతో సేవ చేసిన, ప్రముఖ తెలంగాణా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహిత అయిన సామల సదాశివ గారు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త, కేంద్ర విశ్వ విద్యాలయం పూర్వ కులపతి శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి, ప్రముఖ రాజకీయ వేత్త, పద్య గాయకులైనటువంటి జువ్వాడి గౌతమరావు, ప్రముఖ అణు శాస్త్రవేత్త, రచయిత అయినటువంటి కొడవటిగంటి రోహిణి ప్రసాద్‌లను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ముందుగా సాహిత్య వేదిక సభ్యుడు షేక్ నసీం - ఆగస్టు 8న మరణించిన సామల సదాశివ జీవిత విశేషాలను, అయన రచనా వ్యాసంగం గురించిన విషయాలు సభికులకు పంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన సదాశివ బహు భాషా కోవిదులు, తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠి భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించి ఆ భాషలలోని సాహిత్యానికి ఎంతో సేవ చేసారు. అయన చేసిన పలు అనువాదాలు - అంజద్ సుఫీ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, ఫారసీ కవుల ప్రశస్తి ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

సదాశివ ఒక్క సాహిత్యం మాత్రమె కాకుండా హిందుస్తాని సంగీత విద్వాంసులు. హిందుస్తాని సంగీతం గురించి, అందులో కళాకారులను వివరిస్తూ అయన రాసిన మలయమారుతాలు అనే వ్యాసం సంపుటి ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ది పొందింది. అలాగే మరాఠి సంగీతం విని అయన రాసిన "స్వర లయలు" అనే వ్యాస సంపుటి ఆయనకు 2011 లో కేంద్ర సాహిత్య అకాడమి తెచ్చిపెట్టింది. ఈ సందర్భం గా సదాశివ రాసిన మలయ మారుతాలు లోని రెండు ముచ్చట్ల ను ప్రస్తావించి ముగించారు.

తర్వాత సాహిత్య వేదిక సభ్యుడు డా. జువ్వాడి రమణ - తన పెదనాన్న అయిన జువ్వాడి గౌతమరావు జీవిత విశేషాలను, విశ్వనాథ సత్యనారాయణతో గౌతంరావు సాహిత్య సాంగత్యం గురించి పలు ఆసక్తి కరమైన విషయాలు పంచుకున్నారు. విశ్వనాథ సత్యన్నారాయణను కరీంనగర్‌కు రప్పించడంలో, అయన చెప్పిన నవలలను లేఖకుడిగా, విశ్వనాథ రాసిన పద్యాలనూ రాగయుక్తంగా పాడడంలో జువ్వాడి గౌతమరావు కృషి ఎంతో ఉంది. ఈ సందర్భం గా గౌతమరావు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను సభికులకు చూపించారు. విశ్వనాథ పద్యాలనూ, రుక్మిణి కళ్యాణం పద్యాలనూ పాడడం సభికులందరినీ ఆకట్టుకుంది.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పూర్వాద్యక్షులు కన్నెగంటి చంద్ర - ప్రముఖ అణు శాస్త్రవేత్త, తెలుగు సాహితీ వేత్త అయిన కొడవటిగంటి రోహిణి ప్రసాద్ రచనా వ్యాసంగం గురించి, అలాగే అయన సంగీతాభిలష గురించి వివరించారు. రోహిణి ప్రసాద్ ఒక శాస్త్ర వేత్త గా నిధులు నిర్వర్తిస్తూ, సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు ఎన్నో తెలుగులో రచించారు. అంతే కాకుండా, ఆయనకు హిందుస్తాని సంగీతంలో మంచి ప్రవేశం ఉందని, అయన సితార వాయించే వారని చెప్పారు. గత సంవత్సరం హూస్టన్ లో జరిగిన ఒక సభలో అయన స్వయం గా సితార వాయించారని, అలాంటి వ్యక్తి అకాల మరణం చెందడం తెలుగు పాఠక లోకానికి, అందునా అమెరికా తెలుగు సాహిత్యాభిమానులకు లోటని తెలియజేశారు.

అటు తరువాత ఆగష్టు 12న పరమపదించిన భాషా నిపుణుడు, తెలుగు సాహిత్యం లో అగ్రగణ్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గురించి, వారి దగ్గరి బంధువు, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పూర్వాద్యక్షులు బాపట్ల కృష్ణ - సభాసదులతో ఆయన విషయాలు పంచుకున్నారు. భద్రిరాజు ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి అని, "ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞాని"గా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భాషా కోవిదుడని, ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రచించారని ఆహ్వానితులందరూ తెలుసుకున్నారు.

అటు పిమ్మట, ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నవరపు రంగనాయకులుతను మద్దుకూరి చంద్రహాస్ సభకు పరిచయం చేస్తూ " వీరు వృత్తి పరంగా బి.హెచ్.ఇ.ఎల్. లో పలు హోదాలలో పని చేసి ఆ తర్వాత టాటా సంస్థ లో సలహాదారుగా కూడా పనిచేసారని మరియు సాహిత్యపరంగా పోతన భాగవతాన్ని బాగా ఇష్టపడతారని, పద్యధారణలో చాల ప్రత్యేకత సాధించారని, ప్రస్తుతం విద్యాభారతి సంస్థ నిర్వాహకులుగా, నిర్మాణం లో ఉన్న మురళీ కృష్ణ దేవాలయ కమిటీ అద్యక్షులుగా ఉన్నారని" తెలుపుతూ అన్నవరపు రంగనాయకులని వేదికమీదకు ఆహ్వానించారు.

టాంటెక్స్ కార్య నిర్వాహక కమిటీ సభ్యురాలు జుజారే రాజేశ్వరి ముఖ్య అతిథికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అన్నవరపు రంగనాయకులు "భాగవత మకరందాలు" అనే అంశం మీద ప్రసంగించారు. అయన పోతన భాగవతం లో ఉన్న కొన్ని పద్యాలనూ ధారణ చేస్తూ పోతన పద్య శైలి, భాష ఎంత సరళంగా ఉంటాయో, పాడుకోడానికి ఎంత శ్రావ్యంగా ఉంటాయో వివరించారు. అందరికి అర్థం అయ్యే భాషలో రచన చేసిన కొన్ని పోతన పద్యాలనూ రాగ యుక్తంగా పాడడం సభికులందరిని తన్మయత్వానికి గురిచేసింది. అయన 'శ్రీ కృష్ణుని స్తుతులు', ‘ప్రహ్లాద చరిత్రము', ‘గజేంద్ర మోక్షము' లలో ని కొన్ని పద్యాలనూ పాడి వినిపించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు గీత దమ్మన్న, ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్ శాలువాతో ముఖ్య అతిథిని సత్కరించారు. సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మద్దుకూరి విజయ చంద్రహాస్ , డా.ఊరిమిండి నరసింహా రెడ్డి, మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, నసీం షేక్ ముఖ్య అతిథికి జ్ఞాపికను అందచేసారు. ఈ కార్యక్రమం లో దాదాపు 5౦ మంది సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పాలకమండలి ఉపాధిపతి డా.సి.ఆర్.రావు, పాలకమండలి సభ్యులు ములుకుట్ల మూర్తి, కోశాధికారి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీ వీర్నపు చినసత్యం, చామకూర బాల్కి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+