విప్లవ కథారచయిత తాడిగిరి పోతరాజు మృతి
కరీంనగర్: తొలినాటి విప్లవ కథారచయిత తాడిగిరి పోతరాజు (78) ఇకలేరు. శనివారం ఉదయం కరీంనగర్లోని ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. ఆయన భారతి ,విద్యుల్లత, సృజన పత్రికల్లో కథలు రాశారు. పలు కథలకు బహుమతులు అందుకున్నారు. విరసం, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్సి)లో ఆయన కొంతకాలం పని చేశారు.
అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలు పాలయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ దగ్గర కోతులనడుమ ఆయన స్వగ్రామం. అధ్యాపకుడిగా ఆయన రిటైర్ అయ్యారు 2010 లో హుజురాబాద్లో జర్నలిస్ట్ ఆవునురి సమ్మయ్య అధ్వర్యంలో జనసాహితి సభలో ఆయన 'కేటిల్ 'కథా సంకలనం విడుదలరైంది. శనివారంనాడు కోతులనడుమలోని శాంతినగర్లో ఆయన అంత్య క్రియలు జరుగుతాయి.
1958 నుంచి ఆయన కథారచన చేస్తున్నారు. 1962లో ఆయన నవలిక పావురాలు భారతి పత్రికలో అచ్చయింది. ఆయన రచించిన గాజు కిటికీ కథకు ప్రముఖ కథా రచయిత త్రిపుర ప్రశంలు పొందింది. పోతరాజు మట్టిబొమ్మలు అనే నవల కూడా రాశారు.
ఆయన మృతికి తెలంగాణ రచయితల వేదిక నాయకుడు, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ సంతాపం ప్రకటించారు. పలువురు సాహిత్యవేత్తలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. 1937 మే 2వ తేదీన జన్మించిన పోతరాజు తర్వాతి కాలంలో ప్రజాపక్షం వహించిన రచయితగా రూపాంతరం చేందారు. ఆయన తల్లిదండ్రులు సారమ్మ, రాయపరాజులు. పోతరాజుకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.