శశికళను జయలలిత పార్టీ నుంచి తోసేశారు, పదవి రేసులో నేను: శశికళ పుష్ప
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను కూడా రేసులో ఉన్నానని, తాను పోటీ చేస్తున్నానని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప గురువారం చెప్పారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను కూడా రేసులో ఉన్నానని, తాను పోటీ చేస్తున్నానని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప గురువారం చెప్పారు. పార్టీ నుంచి తనను బహిష్కరించలేదన్నారు. తాను పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నట్లు తెలిపారు.
చిక్కులు - శశికళ ఆందోళన: మొదటి అడుగులోనే దెబ్బ తగిలితే!
పార్టీలోని ప్రతి ప్రాథమిక సభ్యుడికి పోటీ చేసే హక్కు ఉందన్నారు. అయితే, తన పోటీ... రేపు మద్రాసు హైకోర్టు తీర్పు పైన ఆధారపడి ఉంటుందని చెప్పారు. 75 శాతం మంది కార్యకర్తలు పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించేందుకు సిద్ధంగా, సుముఖంగా లేరన్నారు.
అసలు శశికళ పార్టీ సభ్యురాలే కాదని చెప్పారు. తనను నిజంగానే పార్టీ నుంచి బహిష్కరిస్తే లెటర్ రావాలి కదా అన్నారు. రాజ్యసభ రికార్డుల్లోను తాను అన్నాడీఎంకే ఎంపీగానే ఉన్నానని చెప్పారు. శశికళకు అసలు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదన్నారు. ఆమెను జయలలిత పార్టీ నుంచి తోసేశారన్నారు.
శశికళ భర్త నటరాజన్ ప్రజల ముందు పెద్ద నాటకాలు ఆడుతున్నారనే విషయం అర్తమవుతోందన్నారు. నిన్నటి దాకా ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్ రావు ఇంటి పైన ఐటీ దాడుల గురించి స్పందిస్తూ... జయలలిత ఉంటే ఇలా జరగనిచ్చే వారు కాదన్నారు.