Marsupials: ఆస్ట్రేలియా కంగారు జాతుల అసలు ముత్తాతలు వీళ్లే!
కంగారూల దేశంగా పిలిచే ఆస్ట్రేలియా అంటేనే విభిన్నమైన జంతుజాలానికి నిలయం. ముఖ్యంగా పొట్టకు సంచి ఉండే 'మార్సుపియల్స్' (కంగారు జాతులు) అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఈ జీవుల పరిణామ క్రమానికి సంబంధించిన చరిత్రలో ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఒక సరికొత్త రహస్యం వెలుగుచూసింది. ఆస్ట్రేలియా జీవ వైవిధ్యం శాస్త్రవేత్తలు అనుకున్నదానికంటే మరెంతో సంక్లిష్టంగా, మిస్టరీగా సాగిందని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. దాదాపు కోట్లాది సంవత్సరాల క్రితం కనుమరుగైపోయిన ఓ వినూత్న జంతు వంశ వృక్ష శాఖను (న్యూ ఆర్డర్) పరిశోధకులు కనుగొన్నారు.
నిజానికి ఆస్ట్రేలియా ఖండంలోకి ఈ సంచి జంతువులు దాదాపు 5.5 కోట్ల సంవత్సరాల క్రితమే ప్రవేశించాయి. కాలక్రమేణా అక్కడి వాతావరణానికి అలవాటు పడుతూ సుమారు 160 రకాల జాతులుగా విస్తరించాయి. మంచు పర్వతాల్లో శీతాకాలమంతా నిద్రపోయే బుజ్జి పొసమ్ల నుంచి, ఎడారి ఇసుక పొరల కింద కళ్లు లేకుండా తిరిగే గులాబీ రంగు ఎలుకల వరకు ఎన్నో రకాల జీవులు ఇందులో ఉన్నాయి. అయితే, ఈ జీవుల ప్రాచీన చరిత్రలో కొన్ని లింకులు మిస్ అవ్వడంతో, వీటి అసలు మూలాలు ఎక్కడివనేది ఇప్పటికీ సైన్స్ లో పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.

ఆస్ట్రేలియా మార్సుపియల్స్కు ముత్తాతలు!
ఈ క్రమంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ 'యూఎన్ఎస్డబ్ల్యూ' (UNSW) పరిశోధకులు చరిత్ర పుటల్లో కలిసిపోయిన మూడు సరికొత్త జీవుల జాతులను గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను 'జర్నల్ ఆఫ్ పేలియంటాలజీ'లో ప్రచురించారు. ఈ పరిశోధనల్లో తేలిందేమిటంటే.. గతంలో ఎన్నడూ ఊహించని ఒక అతి ప్రాచీన జంతువుల విభాగానికి ఇవి చెందినవి. ఈ కొత్త రకానికి శాస్త్రవేత్తలు 'కీనామార్ఫియా' (Keeunamorphia) అని నామకరణం చేశారు.
ఈ ఆవిష్కరణపై పాలియంటాలజిస్ట్ డాక్టర్ టిమ్ చర్చిల్ మాట్లాడుతూ.. "ఇది కేవలం ఒక కొత్త రకం మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన అత్యంత పురాతన సంచి జంతువుల వంశానికి చెందిన మూలపురుషుడు కావచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న మాంసాహార సంచి జంతువులన్నింటికీ ఇవే తొలి పూర్వీకులు అయి ఉంటాయని భావిస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఒకప్పుడు అక్కడ దట్టమైన అడవులు..
గతంలో దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలు కలిసి 'గోండ్వానా' అనే ఒకే ఒక భారీ ఖండంగా ఉండేవి. ఆ ఖండం విడిపోయినప్పుడు ఈ జంతువులు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయనేది ప్రాథమిక అంచనా. ప్రస్తుతం గుర్తించిన ఈ 'కీనామార్ఫియా' రకానికి చెందిన జీవులు దాదాపు 3.5 కోట్ల సంవత్సరాల పాటు మనుగడ సాగించి, ఆ తర్వాత 1.5 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయని పరిశోధనల్లో తేలింది.
ఇవి కేవలం 25 నుంచి 200 గ్రాముల బరువుండి, కీటకాలను తింటూ బతికేవని అంచనా. ప్రస్తుతం ఎడారిలా మారిన ఉత్తర క్వీన్స్లాండ్ ప్రాంతం.. కోట్లాది సంవత్సరాల క్రితం దట్టమైన వర్షాధార అడవులతో నిండి ఉండేదని, ఆ చెట్ల పొదల్లోనే ఇవి నివసించేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ తర్వాత 1.4 కోట్ల సంవత్సరాల క్రితం వాతావరణం చల్లబడి, అడవులు పోయి గడ్డి మైదానాలుగా మారడంతో ఇవి క్రమంగా అంతరించిపోయాయి.
పంటి వరసతో గుట్టు విప్పిన పరిశోధకులు..
ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ శిలాజాల క్షేత్రమైన 'రివర్స్లే వరల్డ్ హెరిటేజ్' ఏరియాలో లభించిన ఆధారాల ద్వారా ఈ గుట్టు విప్పారు. అక్కడ దొరికిన పురాతన దవడ భాగాలు, పంటి శిలాజాలను (Fossils) క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం జీవించి ఉన్న జంతువుల జన్యువులతో (DNA) ఈ శిలాజాల సమాచారాన్ని మిక్స్ చేసి ఒక ప్రత్యేక వంశ వృక్ష నమూనాను తయారు చేశారు.
ఈ విశ్లేషణలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ కాలంలో ఉన్న ఇతర జంతువుల పళ్లతో పోలిస్తే, ఈ కొత్త జీవుల పంటి వరస చాలా విభిన్నంగా ఉంది. దాదాపు 3.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన 'డ్జార్తియా ముర్గోనెన్సిస్' అనే ఒక పురాతన జంతువు పళ్లను ఇవి పోలి ఉన్నాయి. అంటే, మిగతా జంతువులన్నీ కాలంతో పాటు రూపాంతరం చెందుతున్నా.. ఈ ప్రత్యేక జాతి మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఒంటరిగా తన మనుగడను సాగించిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఒకే ఒక్క జంతువు నుంచి ఈ మార్సుపియల్స్ అన్నీ పుట్టాయనే పాత సిద్ధాంతాన్ని ఈ తాజా పరిశోధన సవాలు చేస్తోంది. ఆస్ట్రేలియా ఖండం విడిపోకముందే అక్కడ ఎన్నో రకాల విచిత్ర ప్రాచీన జీవులు ఉండేవని, వాటిలో కొన్ని మనుగడ సాగించి ఆధునిక జంతువులుగా మారాయని డాక్టర్ చర్చిల్ స్పష్టం చేశారు. ఈ ఆవిష్కరణతో జీవ పరిణామ క్రమంపై ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications