రోడ్డు కింద 20 వేల టైర్లు.. ఎందుకు పూడ్చారో తెలిస్తే షాక్!
ప్రపంచంలో రోడ్ల నిర్మాణానికి రకరకాల పద్ధతులు వాడుతుంటారు. కానీ ఓ రోడ్డు కింద ఏకంగా వేలాది పాత టైర్లను పూడ్చిపెట్టి రహదారి నిర్మించారంటే నమ్ముతారా? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది పక్కా నిజం. చెత్తగా భావించి పారేసే పాత టైర్లతో ఒక అమెరికన్ ఇంజనీర్ చేసిన ప్రయోగం రోడ్ల రూపురేఖలనే మార్చేసింది. పర్యావరణానికి ముప్పుగా మారిన వ్యర్థాలను రీసైకిల్ చేయడమే కాకుండా, శీతాకాలంలో మంచు వల్ల పాడైపోయే రోడ్లను కాపాడుకోవచ్చని నిరూపించిన ఆ ఆసక్తికరమైన కథనమే ఇది.
అమెరికాలోని 'మైనే' అనే ప్రాంతంలో ప్రతి ఏటా వాతావరణం క్రియేట్ చేసే విధ్వంసం అంతా ఇంత కాదు. అక్కడ చలికాలంలో తీవ్రమైన మంచు కురిసి, గ్రామీణ ప్రాంతాల్లోని మట్టి రోడ్ల కింద ఉన్న నేల గడ్డకట్టుకుపోతుంది. ఆ తర్వాత వసంతకాలంలో ఎండలు మొదలవ్వగానే ఆ మంచు కరిగి నీరుగా మారి నేలంతా తీవ్రమైన బురదగా తయారవుతుంది. ఆ దారిలో వెళ్లే భారీ వాహనాలు గుంతల్లో దిగబడిపోవడం, రోడ్లు ధ్వంసం కావడం అక్కడ ఏళ్ల తరబడి జరుగుతున్న పెద్ద తలనొప్పి.

కొండలా పేరుకుపోయిన పాత టైర్ల ముప్పు
మరోవైపు అదే ప్రాంతంలో ప్రతి ఏటా 10 లక్షలకు పైగా పాత కార్ల టైర్లు చెత్తగా మిగిలిపోయేవి. పాత టైర్లు త్వరగా భూమిలో కలవవు. వాటిని అలాగే వదిలేస్తే అగ్నిప్రమాదాలు జరగడం లేదా దోమలు వ్యాపించి పర్యావరణానికి తీవ్ర హాని కలగడం పరిపాటైంది. రోడ్ల సమస్య ఒకవైపు.. ఈ టైర్లను ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవడం మరొకవైపు! ఈ రెండింటికీ ఒకే దెబ్బతో పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు 'యూనివర్సిటీ ఆఫ్ మైనే' సివిల్ ఇంజనీర్ దానా హెచ్. హంఫ్రీ.
టైర్లను ముక్కలు చేసి.. రోడ్డు కింద భద్రంగా!
1995లో ఇంజనీర్ హంఫ్రీ ఒక వినూత్న ఆలోచన చేశారు. పాత టైర్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, రహదారి నిర్మించేటప్పుడు కంకర కింద ఒక దట్టమైన పొరలా పరిచారు. దాదాపు 20,000 పాత టైర్లను ఈ ప్రయోగాత్మక రోడ్డు కింద వాడారు. ఇలా కట్ చేసిన టైర్ల ముక్కలు వేయడం వల్ల నేలలోకి మంచు చొచ్చుకుపోకుండా నిరోధించే ఒక ఇన్సులేషన్ పొరలా అవి పనిచేశాయి. అంతేకాదు, వసంతకాలంలో మంచు కరిగినప్పుడు ఆ నీరు అక్కడ నిలవకుండా సులభంగా బయటకు పోయేలా డ్రైనేజీ వ్యవస్థలా ఉపయోగపడ్డాయి.
సక్సెస్ అయిన మాస్టర్ ప్లాన్.. కోట్లాది రూపాయల ఆదా!
సాధారణ రోడ్లతో పోలిస్తే, ఈ టైర్ ముక్కలతో నిర్మించిన రోడ్లు మంచు ప్రభావాన్ని తట్టుకుని ఎంతో బలంగా నిలిచాయి. గుంతలు పడటం, బురదగా మారడం బాగా తగ్గిపోయింది. ఈ పద్ధతిని ఇప్పుడు 'టైర్ డిరైవ్డ్ అగ్రిగేట్' అని పిలుస్తున్నారు. ఈ వినూత్న సాంకేతికత వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగలేదని, తాగునీరు కూడా కలుషితం కాలేదని అధ్యయనాల్లో తేలింది. సాంప్రదాయ పద్ధతుల కంటే ఈ రీసైక్లింగ్ పద్ధతి ద్వారా ఏకంగా 8.7 మిలియన్ల డాలర్ల ప్రజాధనం ఆదా అయిందని అక్కడి పర్యావరణ పరిరక్షణ సంస్థ నివేదించింది.














Click it and Unblock the Notifications