అది రుగ్వేద కాలం నాటి ఆలయం: తిరుమల తరువాత అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రం
భారత్.. ఎన్నో ప్రాచీన ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలకు నిలయం. వేదాలకు పుట్టినిల్లు. ప్రపంచానికి సంస్కృతి సంప్రదాయాలను నేర్పించింది. స్వయంగా దేవతలు నడయాడిన పరమ పవిత్రమైన పుణ్యభూమి. ప్రతి ఆలయానికీ ఓ చరిత్ర ఉంది.. ప్రతి ప్రాంతానికీ ఓ విశిష్టత ఉంది. యుగాలు మారిన చెక్కు చెదరట్లేదు. పైగా మరింత దేదీప్యమానమౌతూ వస్తోన్నాయి అవి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ఎన్నో ఆలయాలు దేశ చరిత్ర, ప్రజల భక్తిభావాలకు అద్దం పట్టేలా నిలిచాయి.
అలాంటి ఆలయాల్లో కాట్రా వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటి. జమ్మూ కాశ్మీర్లో ఉందీ ఆలయం. రుగ్వేద కాలం నాటి ఆలయంగా దీన్ని భావిస్తారు. సముద్ర మట్టం నుంచి 5,300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత పంక్తుల మధ్య కొలువుతీరారు అమ్మవారు. మంచుకొండల మధ్య ఉంటుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏటా సగటున ఎనిమిది మిలియన్ల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. తమ కోరికలను నెరవేర్చాలని ప్రత్యేక పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల తిరుపతి తరువాత ఆ స్థాయంలో భక్తులు సందర్శించే రెండో పుణ్యక్షేత్రంగా పేరుంది.
వైష్ణోదేవి అమ్మవారు స్వయంభువుగా చెబుతారు. సరస్వతి, లక్ష్మితో కలిసి ఆవిర్భవించారు. భైరవుడు అనే ఓ రాక్షసున్ని సంహరించిన అనంతరం దుర్గాదేవే వైష్ణో దేవి రూపంలో ఇక్కడ అవతరించిందని చెబుతారు. రాక్షసుడి తల గుహ నుంచి లోయలోకి పడిపోయిందని స్థల పురాణం. దేహం కూడా అక్కడే ఉన్న గుహల్లోనే ఉందని విశ్వసిస్తుంటారు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి సూచన మేరకు పాండవులు వైష్ణోదేవిని పూజించారని, అందుకే 18 రోజుల్లోనే కౌరవులను గెలిచారని ప్రతీతి.
గర్భగుడికి చేరుకోవాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. వైష్ణోదేవి ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. మార్చి-అక్టోబర్ మధ్య ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. వైష్ణోదేవి ఆలయాన్ని వెళ్లే భక్తులు తొలుత కాట్రా అనే పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాట్రాకు వెళ్లాలంటే విమాన, రోడ్డు, రైలు సౌకర్యాలు ఉన్నాయి.
కాట్రాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం జమ్ము. జమ్ము నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రాకు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. జమ్మూకు వెళ్లడానికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి రైలు కనెక్టివిటీ ఉంది. లేదా ఢిల్లీకి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా వెళ్లొచ్చు. త్రికూట పర్వతం మీదికి వెళ్లడానికి కాలి నడకలో చేరుకోవాలి. గుర్రాల మీద వెళ్లే వీలు ఉంది.