గిల్ పై వేటు వేయడం వెనుక..? BCCI బిగ్ గేమ్ ప్లాన్
టీ20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టులో శుభ్మన్ గిల్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 15 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం దక్కలేదు. టీ20 ఫార్మట్ లో వైస్ కేప్టెన్గా అతనికి ఇటీవలే పదోన్నతి లభించినప్పటికీ ఇప్పుడు ఏకంగా జట్టులో చోటు కోల్పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేలవమైన ప్రదర్శన కారణంగా బీసీసీఐ అతన్ని టీ20 ఇంటర్నేషనల్స్ జట్టు నుండి తొలగించింది.
ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్స్ ఆడబోయే జట్టులో ఈ ఒక్కటి తప్ప పెద్దగా మార్పులు చేర్పులేవీ చోటు చేసుకోలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. టాప్ ఆర్డర్ లో తిలక్ వర్మ, లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఈ జట్టులో కొనసాగుతున్నారు. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్కు ప్రమోషన్ లభించింది. శుభ్ మన్ గిల్ స్థానంలో వైస్ కెప్టెన్సీ అతనికి దక్కింది.

గిల్ ఒక్కడే కాదు.. మరో ఇద్దరు టీ20 స్పెషలిస్ట్ స్టార్ బ్యాటర్లు కూడా జట్టులో చోటు దక్కలేదు. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్. వీరిద్దరికీ టీ20 వరల్డ్ కప్ ఆడే అవకావం లభించలేదు. యశస్వి జైస్వాల్ స్థానంలో సంజు శాంసన్ జట్టులో బెర్త్ సంపాదించాడు. వికెట్ కీపింగ్ చేయగలగడం, ఓపెనర్ గా ఆడే సామర్థ్యం ఉండటం అతనికి ప్లస్ పాయింట్ అయింది. అంతేకాకుండా టీ20 ఫార్మట్ కు తగ్గట్టుగా దూకుడుగా ఆడగలడు.
మరో బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్. ఫామ్ లో కూడా అతన్ని పక్కన పెట్టారు సెలెక్టర్లు. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టాప్ లేపాడు గైక్వాడ్. సెంచరీతో కదం తొక్కాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అటు ఐపీఎల్ లోనూ తడాఖా చూపుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కు కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. అయినప్పటికీ అతని పేరును పరిగణనలోకి తీసుకోలేదు సెలెక్టర్లు. జట్టు కూర్పు దెబ్బతింటుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications