విధి ఆడిందిరా మీతోని వింత నాటకం- టోటల్ సీన్ రివర్స్
ఆసియా కప్ 2025 సూపర్ 4 రేసు రసవత్తరంగా మారింది. మంగళవారం రాత్రి అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో సీన్ రివర్స్ అయింది. ఫైనల్ బెర్తుల కోసం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ గెలుపు సూపర్ 4 రేసును మరింత ఉత్కంఠగా మార్చింది. ఈక్వేషన్లన్నీ తలకిందులు అయ్యాయి.
ఈ విజయంతో పాకిస్తాన్ రెండు మ్యాచ్లలో రెండు పాయింట్లు సాధించింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.226కు పెరిగింది. మరోవైపు శ్రీలంక రెండు మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ ఆందోళనకరంగా తయారైంది. -0.590కి పడిపోయింది. భారత్ రెండు విజయాలు, +0.689 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో కొనసాగతోంది. ఫైనల్ కు తన బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య నేరుగా పోటీ నెలకొనే అవకాశం ఉంది.

శ్రీలంకకు ఈ ఓటమి పెద్ద దెబ్బ. దాదాపుగా ఈ జట్టు ఫైనల్స్ రేసు నుంచి వైదొలగినట్టే. అయినప్పటికీ ఈ డిఫెండింగ్ ఛాంపియన్ తన నెట్ రన్ రేట్ ను భారీగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ 4 చివరి మ్యాచ్లో భారత్ను ఢీ కొనాల్సి ఉంది లంకేయులకు. ఈ మ్యాచ్ లో గనక శ్రీలంక.. భారీ తేడాతో టీమిండియాను ఓడించడమే కాకుండా, ఇతర మ్యాచ్ల ఫలితాలు అనుకూలంగా వస్తే.. ఫైనల్స్ కు అర్హత సాధించగలుగుతుంది.
శ్రీలంక అర్హత సాధించాలంటే..
- బంగ్లాదేశ్.. భారత్, పాకిస్తాన్ను ఓడించాలి.
- శ్రీలంక.. భారత్ను ఓడించాలి.
- అలా జరిగితే- శ్రీలంక, భారత్, పాకిస్తాన్ మూడూ చెరో రెండు పాయింట్లను సాధించినట్టవుతుంది. ఆ తర్వాత నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు ఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది.
భారత్ అర్హత సాధించడానికి..
- ఫైనల్కు అర్హత సాధించడానికి భారత్.. శ్రీలంక లేదా బంగ్లాదేశ్ ఓడించాలి.
పాకిస్తాన్ అర్హత సాధించాలంటే..
- భారత్, పాకిస్తాన్ రెండూ తమ తమ మ్యాచ్ లల్లో బంగ్లాదేశ్ను ఓడించాలి.
- లేదా బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవాలి. అలాగే.. పాకిస్తాన్ పై కూడా బంగ్లాదేశ్ విజయం సాధించాల్సి ఉంటుంది.
- చివరి మ్యాచ్లో శ్రీలంక.. భారత్ను ఓడిస్తే, పాకిస్తాన్ నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది. భారత్ గనక శ్రీలంకను ఓడిస్తే, భారత్, శ్రీలంక, పాకిస్తాన్ మూడూ చెరో 4 పాయింట్లను సాధించినట్టవుతుంది. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న రెండు జట్లు ఫైనల్స్ లో అడుగు పెడతాయి.
బంగ్లాదేశ్ అర్హత సాధించడానికి..
- భారత్, పాకిస్తాన్పై బంగ్లాదేశ్ గెలవాల్సి ఉంటుంది.
- శ్రీలంక భారత్ను ఓడిస్తే, బంగ్లాదేశ్ నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
- భారత్ శ్రీలంకను ఓడిస్తే, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూడూ చెరో 4 పాయింట్లతో ఉంటాయి. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న రెండు జట్లు అర్హత సాధిస్తాయి.












Click it and Unblock the Notifications