TPL: తెలంగాణ ప్రీమియర్ లీగ్కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్, ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీపి కబురు చెప్పింది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL 2025) నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావు శనివారం వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ నెలలో టీపీఎల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన సంయుక్త కార్యదర్శి ఎన్నికల్లో గోవా క్రికెట్ అసోసియేషన్కి చెందిన రోహన్ దేశాయ్ గెలుపొందారు. ఈ ఎన్నికలో హచ్సీఏ ప్రతినిధిగా జగన్మోహన్ రావు పాల్గొని రోహన్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఈ ఎన్నికల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవాజిత్ సైకియా, ట్రెజరర్ ప్రభ్ తేజ్ సింగ్ భాటియాతో జగన్మోహన్ రావు, హెచ్సీఏ ఉపాధ్యాక్షుడు దల్జీత్ సింగ్ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలోనే తెలంగాణ ప్రీమియర్ లీగ్ తోపాటు మొయినుద్దౌలా గోల్డ్ కప్ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సహకరించాలని జగన్మోహన్ రావు కోరారు. దీనికి బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ నెలలో టీపీఎల్ నిర్వహణకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది.
అంతేగాక, తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ కోరారు. ఇందుకు కూడా బీసీసీఐ పెద్దలు సానుకూలంగా స్పందించారని జగన్మోహన్ రావు వెల్లడించారు. టీపీఎల్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications