భారత్ లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహణ ఆఫర్-వద్దని తోసిపుచ్చిన బీసీసీఐ..!
ప్రపంచ క్రికెట్లో పెద్దన్నగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐసీసీలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ తీసుకునే నిర్ణయాలపై బీసీసీఐ పాత్ర కచ్చితంగా ఉంటుంది. అలాగే భారత్ లో ఉన్న అతిపెద్ద మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మెగా టోర్నీల నిర్వహణకు ఐసీసీ ఎప్పుడూ మొగ్గు చూపుతుంటుంది. ఇదే క్రమంలో ఓ భారీ టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ ఇచ్చిన ఆఫర్ ను బీసీసీఐ తిరస్కరించింది.
ఈ ఏడాది అక్టోబర్లో భారత్ లో మహిళల టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వాలన్న ఐసీసీ ప్రతిపాదనకు బీసీసీఐ ఇవాళ నో చెప్పేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. భారత్ లో ఈ మెగా టోర్నీ నిర్వహణకు తాము సుముఖంగా లేమని ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో ఐసీసీ ఇప్పుడు మరో వేదికను వెతుక్కోవాల్సిన పరిస్ధితి. వాస్తవానికి అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్దితుల నేపథ్యంలో వేదిక మారుతోంది.

బంగ్లాదేశ్ పొరుగునే ఉన్న భారత్ ఈ టోర్నీ నిర్వహణకు ఒప్పుకుంటే ఐసీసీకి చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ బీసీసీఐ నో చెప్పేయడంతో ఇప్పుడు శ్రీలంక, యూఏఈతో ఐసీసీ సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ లో వర్షాకాలం కొనసాగుతుండటం, వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ నిర్వహిస్తుండటం వంటి కారణాలతో టీ20 వరల్డ్ కప్ కు బీసీసీఐ నో చెప్పేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications