Champions Trophy 2025: టాస్ గెలిచిన పాకిస్తాన్-ఏం ఎంచుకుందంటే ?
భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ చేయబోతోంది. మందకొడిగా ఉన్న పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేయడమే మంచిదని ఇరుజట్లూ భావిస్తున్న తరుణంలో టాస్ కీలకంగా మారింది. దీంతో టాస్ గెలవగానే పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏలో ఉన్న భారత్, పాకిస్తాన్ జట్లు తొలిసారి టోర్నీలో తలపడుతున్నాయి. అలాగే ఇరు జట్లలో చాలా మంది క్రికెటర్లు తొలిసారి పరస్పరం తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ పై గెలిచిన జట్టునే ఈ మ్యాచ్ కూ కొనసాగిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఓ మార్పు చేసింది. టోర్నీకి దూరమైన ఓపెనర్ ఫఖర్ జమాన్ స్ధానంలో ఇమాముల్ హక్ ను తీసుకుంది. ఇది మినహా ఇతర మార్పులేవీ లేవు.
పిచ్ తో సంబంధం లేకుండా మంచి స్కోరు చేయడమే తమ ముందున్న లక్ష్యమని టాస్ గెలిచాక పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ తెలిపాడు. ఐసీసీ టోర్నీల్లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమేనని, తమ కుర్రవాళ్లు మంచి ప్రదర్శన ఇస్తారని భావిస్తున్నట్లు వెల్లడించాడు. దుబాయ్ పిచ్ పై తమ క్రికెటర్లకు అవగాహన ఉందని, ఇక్కడి పరిస్ధితులు వారికి అలవాటేనన్నాడు. గతంలో ఏం జరిగిందో వదిలేసి ఈ మ్యాచ్ పై తాము దృష్టిపెడుతున్నట్లు రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. తాము గతంలో ఆడిన వికెట్ లాగే ఈ పిచ్ కూడా ఉందన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో అనుభవజ్టులతో కూడిన తమ జట్టుకు పరిస్ధితులకు తగ్గట్టుగా ఎలా స్పందించాలో తెలుసన్నాడు. గత మ్యాచ్ లో పరుగుల ఛేదన కష్టంగా మారినా తమ కుర్రవాళ్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ ముగించారన్నాడు. ఈ మ్యాచ్ లోనూ పరిస్ధితులతో సంబంధం లేకుండా వారు మంచి ప్రదర్శన ఇస్తారని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications