Champions Trophy 2025: వెళ్లకూడదని నిర్ణయించుకున్న రోహిత్ శర్మ
Rohit Sharma: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య దేశం పాకిస్తాన్ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఒక్క పాకిస్తాన్ మినహా మిగిలిన అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. రోహిత్ శర్మ కేప్టెన్గా శుభ్మన్ గిల్ వైస్ కేప్టెన్గా అపాయింట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్కు చోటు దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా- ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్ల కేప్టెన్ల జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఫొటో షూట్లో పాల్గొనడానికి పాకిస్తాన్కు వెళ్లకూడదని తాజాగా రోహిత్ శర్మ నిర్ణయించాడు. భారత్- పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతను ఈ నిర్ణయిం తీసుకున్నాడు.
ఈ దఫా ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోన్నందున ఆయా జట్ల కేప్టెన్లందరూ లాహోర్కు వెళ్లాల్సి ఉంది. ఐసీసీ నిర్వహించే ఓ బిగ్ టోర్నమెంట్కు ముందు కేప్టెన్లందరూ జాయింట్ ప్రెస్ మీట్లో మాట్లాడటం, ఫొటో షూట్లో పాల్గొనటం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల రోహిత్ అక్కడికి వెళ్లదలచుకోలేదు. ఈ కారణంతోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి తన జట్టును పాకిస్తాన్కు పంపించడానికీ అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా- కేప్టెన్ల ప్రెస్ మీట్ను తటస్థ వేదికకు తరలించాలంటూ ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కేప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజాకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications