ఫస్ట్ క్లాస్ లో మాస్ బ్యాటింగ్: సెంచరీతో తడాఖా చూపిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్
దులీప్ ట్రోఫీ ఫైనల్ మొదటి రోజే ఈస్ట్ జోన్ అదర గొట్టింది. మ్యాచ్ పై పట్టు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. చెన్నై చెపాక్ లోని చిదంబరం స్టేడియం వేదికగా సౌత్ జోన్తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్.. బ్యాటింగ్ లో తడాఖా చూపింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్లో లీడింగ్ రోల్ పోషించిన ఇషాన్ కిషన్ 135 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి క్రీజ్ లో అజేయంగా నిలిచాడు. ఇది అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10వ సెంచరీ. జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తోన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. క్రీజ్ లో సెటిల్ అయిన తర్వాత సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షార్ట్ పిచ్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 4,000 పరుగుల మైలురాయిని దాటేశాడు ఇషాన్ కిషన్.

ఇషాన్ కిషన్కు తోడుగా యువ బ్యాటర్ కుమార్ కుశాగ్రా కూడా రాణించాడు. వీరిద్దరూ అయిదో వికెట్కు అజేయంగా 127 పరుగులు జోడించడం మ్యాచ్ కే హైలైట్. వికెట్లను పడగొట్టే అవకాశం సౌత్ జోన్కు ఎంత మాత్రం ఇవ్వలేదు.కుశాగ్రా 63 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.స్పిన్నర్లపై ధాటిగా ఆడిన కుశాగ్రా.. విజయ్ బౌలింగ్లో లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్లు బాదాడు. ఈ జోడీ అద్భుత ప్రదర్శనతో చివరి సెషన్లో ఈస్ట్ జోన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది టీమ్ ఈస్ట్ జోన్. ఓపెనర్లు దూకుడును ప్రదర్శించారు. వైభవ్ సూర్యవంశీ- 44, అభిమన్యు ఈశ్వరన్- 72 పరుగులతో భారీ ఇన్నింగ్ కు పునాది వేశారు. జట్టు స్కోర్ సరిగ్గా 100 పరుగులు చేరుకున్నప్పుడు వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ దూకుడు తగ్గలేదు. ఆ తర్వాత వచ్చిన శిఖర్ మోహన్ కూడా చెలరేగాడు. 85 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో సుదీర్ కుమార్ ఘరామీ ఆరు పరుగులతో నిరాశపరిచినప్పటికీ.. ఇషాన్ కిషన్, కుశాగ్రా జట్టును పట్టాలెక్కించారు.
సౌత్ జోన్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, నిధీష్, శ్రేయాస్ గోపాల్, షేక్ రషీద్ వికెట్లు పడగొట్టలేకపోయారు. చామా వీ మిళింద్- 2, త్రిపురాన విజయ్ ఒక వికెట్ పడగొట్టగలిగారు. దీనికి తోడు సౌత్ జోన్ స్లో ఓవర్ రేట్ ను కూడా ఎదుర్కొంది. అదనపు సమయం కేటాయించినప్పటికీ మొదటి రోజు 79 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో మొదటి ఇన్నింగ్ లో ఈస్ట్ జోన్ మరింత భారీ స్కోర్ సాధించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications