రోహిత్ శర్మకు చెక్: కేప్టెన్సీ సూర్య చేతికి
T20 world cup 2024: వచ్చే సంవత్సరం జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది.
వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ దీనిమీదే ఉంది. ఈ కప్ కొట్టాలనే పట్టుదల ప్లేయర్లల్లో కనిపిస్తోంది.

భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఉగాండా, అమెరికా.. జట్లు వచ్చే ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024ను ఆడబోతోన్నాయి.
ఈ మెగా టోర్నమెంట్లో రోహిత్ శర్మ ఆడతాడా? లేడా? అనే విషయంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే రోహిత్ శర్మ వయస్సు 36 సంవత్సరాలు. వచ్చే ఏడాది ఈ సంఖ్య 37కు పెరుగుతుంది. టీ20 వంటి మెరుపు ఫార్మట్లో అతను రాణిస్తాడా? లేదా? అనే విషయంపై అనుమానాలు ఏర్పడ్డాయి.
దీనికితోడు ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ ఓటమి అతన్ని వెంటాడుతోంది. టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో యువ క్రికెటర్లకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. టీ20 వరల్డ్ కప్లో ఆడే జట్టులో రోహిత్ శర్మ స్థానంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అతనికి హామీ కూడా ఇవ్వలేదని తేల్చి చెప్పారు.
2024 టీ20 వరల్డ్ కప్ వరకూ రోహిత్ శర్మను కేప్టెన్గా కొనసాగించడానికి బీసీసీఐ అంగీకరించిందంటూ వస్తోన్న వార్తలను జై షా తోసిపుచ్చారు. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉందని, ఈ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ పర్యటన, ఐపీఎల్ టోర్నమెంట్స్ ఉన్నాయని గుర్తు చేశారు.

హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై జై షా మాట్లాడారు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్లో ఉంటోన్నాడని, అతని ఫిట్నెస్, హెల్త్పై తమ మెడికల్ టీమ్.. రోజూ పర్యవేక్షిస్తోన్నారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నాటికి పాండ్యా జట్టుకు అందుబాటులోకి రావొచ్చని వ్యాఖ్యానించాడు.
చాలాకాలంగా రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లను ఆడట్లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్కూ దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికాతో ఆరంభం అయ్యే టీ20 సిరీస్లోనూ ఆడట్లేదు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్ స్థానంపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడానికి, సూర్యకుమార్ యాదవ్ చేతికి జట్టు పగ్గాలను అందించడానికి ఇదే కారణమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications