పాకిస్తాన్ తో ఫైనల్ వేళ.. సూర్యకుమార్ యాదవ్ కు షాకిచ్చిన ఐసీసీ
Aisa Cup 2025 final: ఊహించినట్టే.. ఆసియా కప్ 2025 ఫైనల్స్ లో పాకిస్తాన్ అడుగు పెట్టింది. భారత్ ను ఢీకొట్టబోతోంది. ఈ నెల 28వ తేదీన ఈ మ్యాచ్. ఆసియా కప్ టైటిల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ టోర్నమెంట్ లో భారత్- పాకిస్తాన్ ఎదురెదురు పడటం ఇది మూడోసారి. లీగ్స్, సూపర్ 4 దశలో టీమిండియాదే పైచేయి.
గురువారం రాత్రి దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది పాకిస్తాన్. ఎటువంటి ఈక్వేషన్లతో పని లేకుండా నేరుగా ఫైనల్స్ లో అడుగు పెట్టింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసినప్పటికీ.. ఆ తర్వాత బౌలింగ్ లో దుమ్ము దులిపింది. బంగ్లాదేశ్ ను 124 పరుగుల వద్దే కట్టడి చేసింది.

పాక్ బౌలర్లల్లో షహీన్ షా అఫ్రిది అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. మూడు వికెట్లతో సత్తా చాటాడు హ్యారిస్ రవూఫ్. సయీ అయూబ్- 2, మహ్మద్ నవాజ్ ఒక వికెట్ తీసుకున్నారు. భారత్ తో ఫైనల్స్ కు ముందు జరిగిన ఈ గేమ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైనప్పటికీ.. బౌలర్లు రాణించడం ఆ జట్టుకు ఊరట ఇచ్చింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లల్లో భారత్ ఏకపక్షంగా గెలిచింది. ఫైనల్ లో కూడా అదే రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య టీమిండియా కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాకిచ్చింది. రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది. పాకిస్తాన్ తో పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇకపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ నెల 14న పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. తమ విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం కూడా తెలిపారు. వీటిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుపట్టింది. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అబ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశాలతో కూడుకుని ఉన్నవని తెలిపింది.
ఈ విషయంపై ఐసీసీ ఎలైట్ ప్యానెల్.. సూర్యకుమార్ యాదవ్ ను విచారణకు పిలిచింది. వివరణ కోరింది. అలాగే- ఇక ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది. వీటికి దూరంగా ఉండాలని సూచించింది. ఐసీసీ నిబంధనలను మరోసారి గుర్తు చేసింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం నిబంధనలకు విరుద్ధమనీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications