రైల్వే స్టేషన్లో నిద్ర: రోహిత్ సేన కోసం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తోన్న ఫ్యాన్స్
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో బిగ్ డే. రోహిత్ సేన రంగంలోకి దిగబోతోంది. తన మొదటి మ్యాచ్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. చెన్నైలోని ఎంఏ చిన్నస్వామి స్టేడియం ఈ బిగ్ క్లాష్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది.
శనివారం రెండు మ్యాచ్లు జరిగాయి. తొలి మ్యాచ్లో లో-స్కోర్ నమోదైంది. బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 156 పరుగులను బంగ్లాదేశ్ నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా.. శ్రీలంక తలపడ్డాయి. పరుగుల వరద పారిన మ్యాచ్ ఇది.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. లంకేయులకు చుక్కలు చూపించింది. అయిదు వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్లో ఏకంగా మూడు సెంచరీలు నమోదయ్యాయి. క్వింటన్ డికాక్, రస్సీ వాన్డెర్ డుస్సెన్, కేప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీలు బాదారు. శ్రీలంక కూడా గట్టి పోటీ ఇచ్చింది. 44.5 ఓవర్లల్లో 326 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంకాస్సేపట్లో ఆరంభం అయ్యే భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదవుతున్నాయని అభిమానులు ఆశిస్తోన్నారు. మొన్నటికి మొన్న సొంతగడ్డపై మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో కంగారూలను ఓడించింది టీమిండియా. ఈ సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్లో ఓటమి చవి చూసింది. ఆస్ట్రేలియా తన స్కోరును 300 ల్యాండ్ మార్క్ను దాటించిన మ్యాచ్ అది.
ఈ మ్యాచ్ను చూడానికి అభిమానులు భారీ సంఖ్యలో చెపాక్కు చేరుకుంటోన్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తోన్నారు. ఒక రోజు ముందుగానే చెన్నైకి చేరిన వారూ చాలామందే ఉన్నారు. రాత్రివేళ వారంతా రైల్వే స్టేషన్లోనే నిద్రించారు. ప్లాట్ ఫామ్ మీదే భోజనం చేశారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అంటూ ఎదురు చూశారు.
వారంతా గుంపులు గుంపులుగా చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియానికి చేరుకుంటోన్నారు. చెపాక్ వెళ్లే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితిని పసిగట్టిన చెన్నై సిటీ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు ఇప్పటికే పూర్తి చేశారు. ట్రాఫిక్ జామ్ అయ్యే పాయింట్లల్లో వాహనాలను దారి మళ్లించారు. కొన్ని చోట్ల బ్యారికేడ్లను పెట్టారు.
టీమిండియా తుది జట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications