Arshdeep Singh: తొలి టీ20లో దుమ్ము దులిపేశారు
IND vs BAN 1st T20: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టీ20 ఇంటర్నేషనల్లో భారత బౌలర్లు చెలరేగారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని శ్రీమంత్ మాధవ్ రావు సింధియా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్లో దుమ్ము దులిపారు. బంగ్లాదేశ్ బ్యాటర్లకు తమ బౌలింగ్ సత్తా రుచి చూపించారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ మొత్తం 19.5 ఓవర్లల్లో 127 పరుగులకు కుప్పకూలింది. తొలి ఓవర్ నుంచే బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఎవ్వరు కూడా క్రీజ్లో నిలదొక్కుకోలేకపోయారు. నిప్పులు చెరుగుతున్న బౌలింగ్ను ఎదుర్కొని భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో విఫలం అయ్యారు.

తొలి ఓవర్ అయిదో బంతికే తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో లిట్టన్ దాస్ అవుట్ అయ్యాడు. అప్పటికి బంగ్లాదేశ్ స్కోర్ అయిదు పరుగులే. అక్కడ ఆరంభమై వికెట్ల పతనం.. బ్రేకుల్లేకుండా సాగింది. క్రీజ్లో ఎవ్వరూ కుదురుకోలేకపోయారు.
లోయర్ ఆర్డర్ బ్యాటర్ మెహదీ హసన్ మీర్జా ఒక్కడే భారత బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొనగలిగాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లతో 35 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఓపెనర్లు పర్వేజ్ హొస్సైన్ ఇమాన్- 8, లిట్టన్ దాస్- 4, కేప్టెన్ నాజ్ముల్ హొస్సైన్ శాంటో 27, తౌహిద్ హృదొయ్- 12, మహ్మదుల్లా- 1, జకర్ అలీ- 8, రషీద్ హొస్సైన- 11, తస్కిన్ అహ్మద్- 12, షొరిఫుల్ ఇస్లాం- 0, ముస్తాఫిజుర్ రెహ్మాన్- 1 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లల్లో అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెలరేగారు. మూడు వికెట్లు చొప్పున నేల కూల్చారు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్తో ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోల్కత నైట్ రైడర్స్ స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ బోణీ కొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మహ్మదుల్లాను పెవిలియన్ దారి పట్టించాడు.












Click it and Unblock the Notifications