IPL 2024: ఈసారి ఐపీఎల్ కు ఈ ఐదుగురు భారత స్టార్ ప్లేయర్లు దూరం ?
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ మే 29న ముగియనుందని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే సూత్రప్రాయంగా వెల్లడించాయి. దీంతో ఈసారి ఐపీఎల్ లో సత్తా చాటుకునేందుకు అన్ని జట్లూ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ టోర్నీలో పలువురు టీమిండియా స్టార్ ఆటగాళ్లు సత్తా చాటుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కావాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు స్టార్లు ఈ టోర్నీకి దూరమవుతున్నారు.
ఇలా ఈసారి ఐపీఎల్ 2024కు దూరమవుతున్న స్టార్ ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది. అయితే ఇందులో టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్న ఐదుగురు టాప్ ఇండియన్ ప్లేయర్లు ఈసారి ఐపీఎల్ కు దూరమవుతున్నారు. ఇప్పటికే గాయాల పాలై చికిత్స అందుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఐదుగురు ఆటగాళ్లు దూరం కావడం ఐపీఎల్ లో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ఈసారి ఐపీఎల్ 2024 టోర్నీకి దూరమవుతున్న టాప్ ఇండియన్ ప్లేయర్ల జాబితాలో మొహమ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, పృధ్వీ షా, హార్ధిక పాండ్యా, రిషబ్ పంత్ వంటి వారు ఉన్నారు. వీరంతా గతంలో టీమిండియాకు ఆడిన వారే. జట్టును తమ ఆటతీరుతో పలుమార్లు గెలిపించిన వారే. అలాగే గత ఐపీఎల్ టోర్నీల్లోనూ వీరు సత్తా చాటుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఈ ఐదుగురు టాప్ ప్లేయర్లు పెవిలియన్ కు పరిమితం కాబోతున్నారు.
టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న మిస్టర్ 360, స్కైగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ గాయంతో తాజాగా ఆప్ఘనిస్తాన్ సిరీస్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సూర్య ఐపీఎల్ లో ఆడటం ఇంకా ఖాయ కాలేదు. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు ఈసారి ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
వన్డే వరల్డ్ కప్ లో మెరుపు ప్రదర్శన తర్వాత గాయపడ్డ మొహమ్మద్ షమీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఐపీఎల్ కు దూరం కానున్నాడు. అలాగే గతంలో టీమిండియాలో మెరుపులు మెరిపించి ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పృధ్వీ షాకు ఐపీఎల్2024లో ఢిల్లీ క్యాపిటల్స్ నిరూపించుకునే అవకాశం ఇచ్చినా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వీరంతా అద్భుతాలేమైనా జరిగి ఐపీఎల్ లో ఆడితే మాత్రం టీ20 వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ లో బీసీసీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.
మొహమ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, పృధ్వీ షా,
ఈసారి ఐపీఎల్ కు ఈ ఐదుగురు టాప్ ప్లేయర్లు దూరం












Click it and Unblock the Notifications