మంచి కామెడీ టైమింగ్ ఉంది భయ్యో: ఆర్సీబీ మ్యాచ్లో ఇదే హైలైట్
Virat Kohli: ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో గెలుపున తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్పై తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లల్లో అయిదింట్లో జయకేతనం ఎగురవేసింది. మూడింట్లో ఓడింది. గెలిచిన అయిదూ బయటి స్టేడియాల్లో నమోదైనవే. హోమ్ పిచ్పై ఆడిన మూడింట్లోనూ పరాజయాన్ని చవి చూసింది.
తాజాగా ముల్లాన్పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ను నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ స్కోర్ను ఇంకా ఏడు బంతులు మిగిలివుండగానే దాన్ని కొట్టి పడేసింది ఆర్సీబీ.

ఆర్సీబీ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది పంజాబ్ కింగ్స్. ఒకదశలో 76 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య- 22, ప్రభ్సిమ్రన్ సింగ్- 33, జోస్ ఇంగ్లీస్- 29, శశాంక్ సింగ్- 31 (నాటౌట్), మార్కొ జన్సెన్- 25 (నాటౌట్) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.
కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ రెండు వికెట్ల చొప్పున రొమారియో షెప్పర్డ్ ఓ వికెట్ తీసుకున్నారు. యాష్ దయాళ్, జోష్ హేజిల్వుడ్ మినహా మిగిలిన బౌలర్లు పొదుపుగా బంతులు సంధించారు. బ్యాటర్లను కట్టడి చేశారు. రెండు ఓవర్లు మాత్రమే వేసిన యాష్ దయాళ్ ఏకంగా 22 పరుగులు ఇఛ్చుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలవోకగా టార్గెట్ను ఛేదించింది. ఈ క్రమంలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద ఓపెనర్ ఫిల్ సాల్ట్ అవుట్ అయినప్పుడు కొంత ఒత్తిడిని ఎదుర్కొంది గానీ ఆ తరువాత వచ్చిన దేవ్దత్ పడిక్కల్, అప్పటికే క్రీజ్లో విరాట్ కోహ్లీ.. భారీ షాట్లతో ఎదురుదాడికి దిగారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.

35 బంతుల్లో నాలుగు బారీ సిక్సర్లు, అయిదు ఫోర్లతో 61 పరుగులు చేశాడు పడిక్కల్. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో షాట్లు ఆడాడు. 54 బంతుల్లో ఒక సిక్స్, ఏడు ఫోర్లతో 73 పరుగులతో నాటౌట్గా నిలిచాడు కోహ్లీ. తొలుత పడిక్కల్, ఆ తరువాత రజత్ పటిదార్- 12 వెంటవెంటనే అవుట్ అయ్యారు గానీ.. అప్పటికే ఆర్సీబీ గెలుపు దాదాపుగా ఖాయమైంది.
ఛేజింగ్లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కోహ్లీ. ఈ ఎనిమిది మ్యాచ్లల్లో కోహ్లీ నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో మూడు అజేయంగా సాధించినవే. ఇప్పటివరకు ఆడిన ఈ ఎనిమిదింట్లో 59, 31, 7, 67, 22, 62, 1, 73 పరుగులు చేశాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం పంజాబ్ కింగ్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను టీజ్ చేస్తూ కనపించాడు కోహ్లీ.












Click it and Unblock the Notifications