Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత అవార్డు..! 14 ఏళ్లకే..!
భారత క్రికెట్లో అతిపిన్న వయస్సులోనే తన సంచలన బ్యాటింగ్ తో రికార్డులు తిరగరాస్తున్న బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇవాళ మరో అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 14 ఏళ్ల వయస్సులోనే భారత్ లో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఇవాళ ఈ అవార్డు అందుకున్నాడు. దీంతో వైభవ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ అవార్డు స్వీకారం తర్వాత వైభవ్ ప్రధాని మోడీతో భేటీ కానున్నాడు.
ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీని తాజాగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బల్ పురస్కార్ కు ఎంపిక చేశారు. దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వచ్చాడు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ద్రౌపదీ ముర్ము వైభవ్ కు ఈ అవార్డు అందజేశారు. వైభవ్ తో పాటు పలు రంగాల్లో అసాధారణ విజయాలు అందుకున్న పలువురు బాలలకు ఈ అవార్డులు లభించాయి.

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారతదేశంలో 5-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ధైర్యం, కళ & సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణ, సైన్స్ & టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడల్లో అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం దీనిని ప్రదానం చేస్తారు. తద్వారా భవిష్యత్తులో వారు మరింత మెరుగ్గా ఆయా రంగాల్లో రాణించడంతో పాటు దేశంలోని బాలలకు స్పూర్తి నిస్తారనే ఉద్దేశంతో ఇస్తారు. తాజాగా బీహార్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో వైభవ్ 190 పరుగులు కొట్టి రికార్డులు తిరగరాశాడు. అదీ కేవలం 84 బంతుల్లోనే కావడం విశేషం.












Click it and Unblock the Notifications