ఎట్టకేలకు వినేష్ ఫొగట్కు పతకం
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆమెకు బంగారు పతకం లభించింది. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని హర్యానాలోని సర్వ్ ఖాప్ పంచాయత్ గోల్డ్ మెడల్ను ప్రదానం చేసింది.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.

నిజానికి ఫైనల్స్లో ఓడిపోయినా కూడా రజత పతకం ఖాయం అయ్యేదే. శరీర అదిక బరువు కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ నుంచే వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారామె. ఇప్పుడు ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది.
తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేశారు. ఆమె తరఫున భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ను ఆశ్రయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించిన కోర్టు అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. దీనితో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు.
ఈ పరిస్థితుల్లో భారత్కు తిరిగి వచ్చిన వినేష్ ఫొగట్కు హర్యానా ఖాప్ పంచాయత్ బంగారు పతకంతో గౌరవించింది. 30వ పుట్టినరోజు నాడు ఆమెకు ఈ మెడల్ను అందజేసింది. ఖాప్ పంచాయత్ తన సొంత నిధులతో దీన్ని తయారు చేయించింది. ఈ పతకంపై ఒలింపిక్స్ సింబల్, 2024 అనే అక్షరాలను ముద్రించింది.
దీనిపై వినేష్ ఫొగట్ స్పందించారు. తన సొంత ఊరిలో, సొంత మనుషుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. అంతకుమించి హర్యానా ఖాప్ పంచాయత్ తనకు బంగారు పతకాన్ని బహూకరించడం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications