Shreyasi Singh: పారిస్ ఒలింపిక్స్ లో బీహార్ ఎమ్మెల్యే.. ! స్వర్ణ పతకంపైనే గురి..
విశ్వక్రీడల వేదిక అయిన ఒలింపిక్స్ కు ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఆతిధ్యమిస్తోంది. ఇందులో అదృష్టం పరీక్షించుకునేందుకు భారత్ తో పాటు వివిధ దేశాల క్రీడాకారులు ఇప్పటికే పారిస్ కు చేరుకుంటున్నారు. ఈ నెల 26న ప్రారంభమైన ఈ ఒలింపిక్స్ ఆగస్టు 11తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత్ నుంచి కూడా క్రీడాకారులు తరలివెళ్లారు. వీరిలో ఒకరు మాత్రం అందరి కంటే ప్రత్యేకం. ఆమె పేరే శ్రేయసీ సింగ్.
బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే శ్రేయసీ సింగ్ ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. షూటింగ్ విభాగంలో శ్రేయసి పోటీ పడుతున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో జరిగే షూటింగ్ ఈవెంట్ లో శ్రేయసి పాల్గొనబోతున్నారు. దీంతో రాజకీయాల్లో ఉంటూ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారిణిగా శ్రేయసి రికార్డుల్లో చోటు సంపాదించబోతున్నారు. ఆమె బీహార్ నుంచి ఒలింపిక్స్ లో పోటీపడుతున్న తొలి అథ్లెట్. అంతే కాదు ఒలింపిక్స్ లో పాల్గొంటున్న తొలి ప్రజాప్రతినిధి కూడా.ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించడమే లక్ష్యంగా ఆమె పోటీపడుతున్నారు.

2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి జముయ్ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన శ్రేయసీ సింగ్ స్వతహాగా షూటర్. ఆమె మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ పతుల్ కుమారి దంపతుల కుమార్తె. ఓవైపు షూటర్ గా రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 గ్లాస్ గో కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించిన శ్రేయసీ సింగ్.. 2018లో గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో షూటింగ్ డబుల్ ట్రాప్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ కూడా సాధించారు. 2018లో కామన్వెల్త్ మెడల్ సాధించాక అర్జున అవార్డు కూడా లభించింది.












Click it and Unblock the Notifications