ఏమిటి వెంకటస్వామి ఘనత?
హోంపేజి టాక్ ఆఫ్ టుడే రాజకీయాలు 10-02-2006 ;?
హైదరాబాద్: తనకు కేంద్రంలో మంత్రిపదవి అవసరం లేదని, రాష్ట్రపతి పదవి ఇస్తే చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి ఒక సీరియస్ జోక్ పేల్చారు. రాష్ట్రపతి కావడానికి వెంకటస్వామికి గల ఏకైక అర్హత వృద్ధ్యాప్యం మాత్రమే. 1957లో ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అనేక సందర్భాల్లో వెంకటస్వామి బహిరంగంగా ప్రకటనలు చేశారు. కాంగ్రెస్-టిఆర్ఎస్ల మధ్య సీట్ల పంపిణీ ఒప్పందం కుదర్చడంలో ఆయన కూడా కీలక పాత్ర వహించారు. ఇందిరాగాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉండడమే తనకున్న పెద్ద మెరిట్ అని వెంకటస్వామి విశ్వాసం.
వెంకటస్వామికి పరిపాలనా దక్షుడిగా పేరు లేదు. బలహీనవర్గాల వారి నుంచి కొంత ఫీజు వసూలు చేసుకుని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించిన చరిత్ర వెంకటస్వామిది. అందుకే ఆయనకు గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. పేరుకి దళితుడైనప్పటికీ వెంకటస్వామిది దొరల పోకడే. ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన వెంకటస్వామి కుటుంబానికి నేడు విశాఖ ఇండ్రస్టీస్తో సహా అనేక పారిశ్రామిక సంస్ధలు ఉన్నాయి. వాటి టర్నోవర్ కొన్ని వందల కోట్లు. అయినా ఆయన ఎస్సి రిజర్వుడు స్ధానం నుంచే ఎన్నికవుతూ ఉంటారు.
మన రాష్ట్రం నుంచి రాష్ట్రపతులైన వారు గతంలో చాలా మంది ఉన్నారు. ఆచార్య ఎన్జి రంగాకు రాష్ట్రపతి పదవి ఇవ్వడానికి ఇందిరాగాంధీ సుముఖత వ్యక్తం చేసినా ఆయన అంగీకరించలేదు. రంగా వ్యక్తిత్వం విలక్షణమైనది. వెంకటస్వామి, సుబ్బిరామిరెడ్డి, హనుమంతరావు వంటి వారు ఇందిరాగాంధీ కుటుంబానికి వంది మాగధులు తప్ప వారికి సొంత వ్యక్తిత్వమంటూ లేదు. కాంగ్రెస్ దుష్ట సంస్కృతికి పూచిన పువ్వులు వీరు. హనుమంతరావుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని వెంకటస్వామి గొప్ప భాష్యం చెప్పారు. హనుమంతరావు తరఫున తను వకాల్తా తీసుకుంటే తన రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి ఆయన సోనియా వద్ద పైరవీ చేస్తారని వెంకటస్వామి పథకం. పదవీ వ్యామోహపరులను దూరంగా ఉంచాలని రాజీవ్ గాంధీ ఏనాడో కాంగ్రెస్ ప్లీనరీలో నొక్కి చెప్పినా, రాజకీయ పరిపక్వత లేకపోవడం వల్ల ఇప్పుడు ఆమె చుట్టూ పవర్ బ్రోకర్లే చేరారు.
ఇటీవలి కథనాలు