జగన్ పై మంత్రాంగం

దాదాపు ఆరు నెలల పాటు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తమకేమీ అభ్యంతరం లేదని, గడువులోగా పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించి, ఆ ఉప ఎన్నికలో రాజశేఖర రెడ్డి సతీమణి గానీ కూతురు గానీ పోటీ చేసేలా చర్యలు తీసుకుంటామని, వారిలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవిని అప్పుడు ఇస్తామని, జగన్ ను మాత్రం అంగీకరంచబోమని చెప్పినట్లు సమాచారం. జగన్ ముఖ్యమంత్రి కావాలనే భావోద్వేగం సమసిపోయిన తర్వాత అసలు విషయాన్ని బయట పెట్టాలని సోనియా తన కోటరీలోని నాయకులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి పాలనా యంత్రాంగం కుంటుపడకుండా చూసుకుంటే చాలునని అన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ వ్యవహారాల కోసమైతే రోశయ్య పనికి రారని, ఆ ఆలోచన చేయడానికి కొంత సమయం తీసుకోవచ్చునని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జగన్ అనుకూల వర్గం వ్యవహరించిన తీరు వల్ల సోనియా గాంధీ జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారినట్లు చెబుతున్నారు. అయితే, జగన్ ను పూర్తిగా దూరం చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఆమె లేనట్లు తెలుస్తోంది. తమ ఆలోచనలకు అనుగుణంగా ఆయన నడుచుకోవాల్సిందేనని చెబుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే జగన్ వేడి చాలా వరకు చల్లారింది. మంగళవారం కెవిపి రామచందర్ రావు నివాసంలో జరిగిన సమావేశానికి 13 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. ఇంతకు ముందు జగన్ కు అనుకూలంగా గళమెత్తిన కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు ఇప్పటికే తప్పుకున్నారు. జగన్ వెంట ఉన్న మంత్రుల మాటల్లో కూడా వేడి తగ్గింది. సోనియా గాంధీ నిర్ణయమే శిరోధార్యమనే వర్గం పెరుగుతూ వస్తోంది. సోనియా గాంధీ ఆశిస్తున్నది కూడా అదే. మొత్తం ఆమె అనుకున్నట్లే జరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications