ప్రభావం-ముభావం
ఈమధ్య కాంగ్రెస్ అధిష్టానవర్గం నుంచి ఆయనకు సహకారం అంతంత మాత్రంగానే ఉంది. పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ కు హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడం అయనకు సహజంగా నచ్చడం లేదు. తెలుగువారు అధికంగా ఉన్న పొరుగురాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో ప్రచారం చేయవలసిందిగా గతంలో లాగా కాంగ్రెస్ హై కమాండ్ ఆయనను కోరలేదు. ఇది తప్పకుండా ఆయనకు బాధ కలిగించే అంశమే. అన్నిటికీ మించి యువరాజు రాహుల్ గాంధీ చంద్రబాబును మెచ్చుకోవడం వైఎస్ కు తలకొట్టేసినంత పనయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరికొన్ని తరాల పాటు అధికారంలో ఉంచే బృహత్ లక్ష్యంతో కుమారుడు జగన్ ద్వారా కొన్ని వందల కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్స్ ను అధికార బలం లేకుండా ఇప్పటిలా నడపడం కష్టమని మీడియా ఆర్ధిక నిపుణుల అభిప్రాయం. సాక్షి మీడియా గ్రూపు తీవ్ర నష్టాల్లో ఉన్నందున పబ్లిక్ ఇష్యూకు వెళ్ళినా విజయవంతమవుతుందన్న భరోసా లేదు. బడా పారిశ్రామిక వేత్తలు మొహం చాటేసే అవకాశముంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, వైఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగితే సాక్షి మీడియా గ్రూపు పంటపండినట్టే. మరిన్ని విస్తరణ పథకాలు ఉంటాయి. తండ్రి ముఖ్యమంత్రి అయినా కాకున్నా వైఎస్ జగన్ ఎంపీ కావడం ఖాయం. తన మేధాశక్తితో ఢిల్లీలో ఏర్పడబోయే పరిచయాలతో తన వ్యాపార, మీడియా సామ్రాజ్యాన్ని సమర్ధంగా నడుపుకోగనన్న ఆత్మ విశ్వాసం జగన్ లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సాక్షి పత్రిక, చానల్ మరింత జనాదరణ పొందుతాయని, తద్వారా ఆదాయం పెంచుకోవచ్చని ఆయన నమ్మకం.