సోనియా 'తెలంగానం'?
అనేక కుంభకోణాల్లో వైఎస్ చిక్కుకుని ఉన్నందువల్ల తెలంగాణ గురించి పట్టుబట్టడానికి ఇదే మంచి తరుణమని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు సోనియాగాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం గురించి ప్రకటన చేసి, టీఅర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం మహా కూటమి ప్రభావం తగ్గిపోతుందని అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే సోనియా గాంధీకి చెప్పారు.
ఆంధ్రప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పార్టీ శ్రేయస్సుకి మంచిదని చెప్పినట్టు తెలిసింది. నిన్న సోనియాగాంధీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీకి ఇదే విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో సోనియాగాంధీ అనుకూలంగా ఉన్నట్టు సాంబశివరావు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం విషయంలో వైఎస్ ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటివరకు ఆయనను నమ్ముకుని పూర్తి స్వేచ్చ ఇచ్చిన అధిష్టానవర్గం ఎన్నికల ముందు పునరాలోచనలో పడింది. వైఎస్ ఒంటెద్దు పోకడలు, ఆయన చుట్టూ కమ్ముకున్న కుంభకోణాల నీడలు హై కమాండ్ ను కలవరపరుస్తున్నాయి. ఒక్క వారం రోజుల్లో ఒక స్పష్టమైన రాజకీయ చిత్రం కన్పించే అవకాశాలున్నాయి.