వైయస్ జగన్ కు తెలంగాణ చెక్?

YS Jagan
తెలంగాణతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెక్ పెడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్రలో తన ప్రాబల్యాన్ని చాటుతున్న వైయస్ జగన్ నుంచి తెలంగాణలోనైనా ఆత్మరక్షణ విధానాన్ని అవలంబించాలనే యోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు శ్రీకృష్ణ కమిటీ నివేదికను వాడుకోవాలని చూస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నుంచే కాకుండా వైయస్ జగన్ నుంచి, తిరిగి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నుంచి క్యాడర్ ను, నాయకులను కాపాడుకోవడం కాంగ్రెసు పార్టీకి గగనమే అవుతుంది. తెలంగాణకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనుకూలంగా వస్తుందనే ఉద్దేశంతో లేదా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే దాకా ఆగుదామనే ఉద్దేశంతో కెసిఆర్ కాంగ్రెసుపై అంతగా దృష్టి సారించడం లేదు. కాంగ్రెసును ఇప్పటికే ఆయన టార్గెట్ చేసుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడి మీద ప్రయోగించినంత వ్యూహాన్ని ప్రయోగించలేదు.

కాంగ్రెసు మీద తెలంగాణ ప్రజలకు పూర్తిగా నమ్మకం లేకపోయినప్పటికీ కాస్తా వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రంగంలోకి దిగి విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామాలైనా చేస్తామని ప్రకటించారు. కెసిఆర్ ఆ రకంగా కాంగ్రెసు తెలంగాణ నాయకుల ముందరి కాళ్లకు బంధం వేశారు. కానీ, కాంగ్రెసు తెలంగాణ నాయకులపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను విశ్వసించడానికి లేదని అంటున్నారు. వారు ముంచుతారో తేలుస్తారో కూడా తెలియని పరిస్థితి. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ డిమాండ్ పై ముందుకు రాకపోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు బ్రహ్మాండమైన ఆస్త్రం దొరుకుతుంది. వైయస్ జగన్ కాంగ్రెసును తప్పు పడుతూ తెలంగాణ అనుకూలం నిర్ణయంతో ముందుకు రావడానికి అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలంగాణలో తెరాసకు, తమకు తప్ప మరొకరికి స్థానం లేకుండా చేసే ఆలోచన కాంగ్రెసు అధిష్టానం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

కాగా, సీమాంధ్రలో చంద్రబాబును, వైయస్ జగన్ ను ఎదుర్కోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని వాడుకోవాలని చూస్తోంది. అందుకు దాదాపుగా చిరంజీవి కూడా సిద్ధపడినట్లేనని చెప్పవచ్చు. సమైక్యాంధ్ర నినాదంతో చిరంజీవి ముందుకు వచ్చినందున సీమాంధ్ర ప్రజలను తమ వైపు తిప్పుకోవడం సులభమే అవుతుందని అనుకుంటున్నారు. అదే సమయంలో వైయస్ జగన్ కు ఇప్పుడున్నంత ఊపు భవిష్యత్తులో ఉండకపోవచ్చునని కూడా అంచనా వేస్తున్నారు. వైయస్ జగన్ ను, చంద్రబాబును దెబ్బ తీయాలంటే తెలంగాణ అస్త్రమే ప్రయోగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణ అంశమే కాంగ్రెసును ముంచడమో, తేల్చడమో చేస్తుందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+